సరిహద్దు విషాదం: తీవ్ర హిమపాతంతో నలుగురు సైనికులు, ఐదుగురు పౌరులు మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో గడిచిన 48 గంటల్లో మంచు చరియలు విరిగిపడటంతో ముగ్గురు సైనికులు, ఓ బీఎస్ఎఫ్ జవాను చనిపోయారు. మరో ఐదుగురు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం జమ్మూకాశ్మీర్లోని నియంత్రణ వెంబడి కాపలాగ ఉన్న మరో సైనికుడు గల్లంతయ్యాడు.
బండిపార జిల్లా గురెజ్, రాంపురా, కుప్వారా జిల్లాలోని మచిల్ ప్రాంతంలో పొగమంచు దట్టంగా ఆవరించింది. తీవ్ర హిమపాతం, మంచు చరియలు ఆర్మీపోస్టుపై పడటంతో విధి నిర్వహణలో ఉన్న ఓ బీఎస్ఎఫ్ జవానుతోపాటు మరో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
గుల్మార్గ్ సెక్టార్లో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో గర్వాల్ రైఫిల్స్ రెజిమెంట్కు చెందిన ఓ సైనికుడు మంచుకొండల్లోకి జారిపడటంతో గల్లంతయ్యాడని సైనికాధికారులు వెల్లడించారు. గల్లంతైన జవాన్ను హవాల్దర్ రాజేంద్ర సింగ్ నేగిగా గుర్తించినట్లు తెలిపారు. అతని కోసం ముమ్మర గాలింపు చేపట్టినట్లు తెలిపారు.
మంచు చరియలు విరిగిపడటంతో ఐదుగురు పౌరులు మరణించారని తెలిపారు. మంచు చరియల్లో చిక్కుకున్న మరో నలుగురు పౌరులను భద్రతా దళాలు కాపాడాయని అధికారులు తెలిపారు.
కాగా, శీతాకాలంలో సరిహద్దు ప్రాంతంలో గడ్డకట్టే చలి ఉంటుంది. మంచు వర్షంలా పడుతూనే ఉంటుంది. మంచు పర్వతాల్లో విధులు నిర్వహించే సైనికులు అప్పుడప్పుడు మంచు చరియలు విరిగిపడటంతో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అయినా దేశ రక్షణ కోసం సైనికులు ఆ గడ్డకట్టే చలిలో కూడా విధులు నిర్వహిస్తూనే ఉన్నారు.