రిపబ్లిక్ డే రోజున దాడులకు కుట్ర: ముగ్గురు ఉగ్రవాదుల హతం, మరో ఏడుగురి అరెస్ట్
శ్రీనగర్: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దాడులు చేసేందుకు ఉగ్రవాదులు చేసిన కుట్రను భారత సైన్యం భగ్నం చేసింది. పుల్వామా ఉగ్రదాడిలో కీలకంగా వ్యవహరించిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ముఖ్య నేత ఖారీ యాసిర్ను భారత భద్రతా బలగాలు శనివారం హతమార్చాయి.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ దిల్లన్, ఐజీ విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. కాశ్మీర్లోని అవంతిపురలో ఉగ్రవాదులున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా అధికారులు ఆ ప్రాంతంలో నిఘా పెంచారు. ఈ క్రమంలో అధికారులు తనిఖీలు చేపడుతుండగా.. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో యాసిర్ తోపాటు మరో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు కూడా గాయాలపాలయ్యారు. జనవరి 26న గణతంత్ర వేడుకల నేపథ్యంలో భారీ దాడులకు ఉగ్రవాదులు పన్నాగం పన్నినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో వేట కొనసాగుతోందని తెలిపారు.
ఇది ఇలావుండగా, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధమున్న ఏడుగురు ఉగ్రవాదుల అనుచరులను ఉత్తర కాశ్మీర్లోని బందిపోర జిల్లాలో భారత బద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో వీరిని అరెస్ట్ చేసినట్లు సీనియర్ ఎస్పీ రాహుల్ మాలిక్ మీడియాకు తెలిపారు. ఉగ్రవాదులకు ఆర్థికంగా, రవాణా, ఇతర విధాలుగా అరెస్టైన ఏడుగురు సహకరిస్తున్నారని చెప్పారు.