ఎన్కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు హతం, 50మందికి గాయాలు
శ్రీనగర్: కాశ్మీర్లోని షోపియాన్లో ఉగ్రవాదులు, భద్రతా దళాలు భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా, మరో 50మంది అల్లరి మూకలు గాయపడ్డారు. మంగళవారం ఉదయం కుండలన్ గ్రామంలో ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
ప్రజలను అక్కడ్నుంచి తరలిస్తుండగానే ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో ఇద్దరు అధికారులు గాయపడ్డారు. వెంటనే భద్రతా దళాలు కూడా ఉగ్రవాదులపై ఎదురుకాల్పులకు దిగారు.
భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతి చెందిన ఉగ్రవాదులు జైషే మహమ్మద్ సంస్థకు చెందిన వారిగా గుర్తించినట్లు డీజీపీ శేష్పాల్ వైద్ వెల్లడించారు. వీరిలో ఒకరు కాశ్మీర్కు చెందిన సమీర్ అహ్మద్ షేక్, కాగా, మరొకరు విదేశీ ఉగ్రవాదిగా అనుమానిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా, ఎదురుకాల్పుల విషయం తెలుసుకున్న అల్లరిమూకలు కుండలన్ గ్రామం వద్దకు చేరుకుని ఉగ్రవాదులను తప్పించే ప్రయత్నం చేశాయి. భద్రతా దళాలపై రాళ్లు రువ్వాయి. దీంతో భద్రతా దళాలు వారిని అదుపు చేసేందుకు టియర్ గ్యాస్, పెల్లెట్లను ప్రయోగించారు. దీంతో సుమారు 50మందికి గాయాలయ్యాయి. అక్కడ చాలా సేపటి వరకు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది.