ఆర్టికల్ 35ఏను టచ్ చేస్తే: ఒమర్ అబ్దుల్లా హెచ్చరిక, ఎన్నికలపై ప్రధాని మోడీకి సవాల్
శ్రీనగర్: ఆర్టికల్ 35ఏను టచ్ చేస్తే అరుణాచల్ ప్రదేశ్ కంటే దారుణమైన పరిస్థితులు జమ్ము కాశ్మీర్లో ఉంటాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోమవారం హెచ్చరించారు.
పీఆర్సీ విషయంలో అరుణాచల్ ప్రదేశ్లో పీఆర్సీ ఇష్యుపై నిరసనలు తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒమర్ మాట్లాడారు. ఆర్టికల్ 35ఏను టచ్ చేస్తే అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతున్న దాని కంటే తీవ్రమైన పరిస్థితులు ఉంటాయని అభిప్రాయపడ్డారు.
ఉగ్రదాడులు, వేర్పాటువాదులు రేపుతున్న అలజడితో జమ్ము కాశ్మీర్లో తరుచూ ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సమయానికి ఎన్నికలు నిర్వహించడమనే విషయం ప్రధాని మోడీ ప్రభుత్వానికి పరీక్ష వంటిదేనని కూడా ఒమర్ అబ్దుల్లా అన్నారు.
మార్చి 4, 5 తేదీల్లో ఎన్నికల సంఘం జమ్ము కాశ్మీర్లో పర్యటించి, అక్కడి పరిస్థితులు పరిశీలించనుంది. లోకసభ ఎన్నికలతో పాటు రాష్ట్ర ఎన్నికలు నిర్వహించాలా? లేదా ఈ ఎన్నికల తర్వాత నిర్వహించాలా? అనే విషయమై తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర పర్యటన అనంతరం ఈ విషయంపై స్పష్టత ఇవ్వనుంది.
ఈ నేపథ్యంలో ఎన్నికలపై తన ట్విటర్ ఖాతా ద్వారా ఒమర్ అబ్దుల్లా స్పందించారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలను మినహాయిస్తే 1995-96 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలన్నీ షెడ్యూలు ప్రకారమే జరిగాయని, ఈసారి కూడా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగేలా చేసే సమర్థత మోడీకి ఉందా? లేకపోతే జమ్ము కాశ్మీర్ను అసమర్థంగా పాలించానని ఆయన ఒప్పుకుంటారా? మరికొన్ని రోజుల్లో ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగనివ్వకుండా చేసే వేర్పాటువాదులు, ఉగ్రవాదుల ఒత్తిడికి మోడీకి లొంగుతారా? లేదా షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరిగేలా చేస్తారా? ఈ అయిదేళ్లు జమ్ము కాశ్మీర్ను ఎలా పాలించారన్న విషయంపై నిజం తెలిసే సమయం ఇది అని మరో ట్వీట్ చేశారు.