'పూరీ జగన్నాథ ఆలయం ఎప్పుడైనా కూలిపోవచ్చు'
భువనేశ్వర్: ఒడిశాలోని ప్రసిధ్ద పూరీ జగన్నాథాలయంపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నాతాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్నాథాలయం ఎప్పుడైనా కూలిపోవచ్చంటూ మంగళవారం హెచ్చరించారు.
జగన్నాథాలయం పరిరక్షణకు తక్షణమే చర్యలు దిగకపోతే నష్టం తప్పదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా టెక్నికల్ కోర్ కమిటీ ఛైర్మన్ జీసీ మిత్రా ఆమె పదవీ విరమణ సందర్భంగా చెప్పారు. పూరీలోని జగన్నాథాయంపై బీబీసీ కూడా ఓ నివేదికను రూపొందించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.
ఇటీవలే ఒడిశా ముఖ్యమంత్రి ప్రధాని మోడీకి పూరీ జగన్నాథాలయం పరిస్థితిపై లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆలయ అభివృద్ధికి వెంటనే చర్యలు తీసుకోవాలని అందులో ఆయన పేర్కొన్నారు. లేఖలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తమ బాధ్యతను సరిగ్గా నిర్వహించడంలేదని కూడా ఆయన మోడీకి ఫిర్యాదు చేశారు.
పూరీ జగన్నాథాలయ అభివృద్ధి చర్యలపై కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, మహేశ్ శర్మలతో పాటు సోమవారం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చీఫ్, అధికారులు సమావేశమయ్యారు. అయితే కొన్ని సాంకేతిక కారణాలవల్లే ఆలయ పునరుద్ధరణ పనులు ఆలస్యం అవుతున్నాయని ఈ సందర్భంగా దర్మేంద్ర ప్రధాన్ మీడియాకు తెలిపారు.
పూరీ జగన్నాథాలయం పునరుద్ధరణ పనులకోసం ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందని ఆయన చెప్పారు. త్వరలోనే కల్చరల్ సెక్రటరీ నేతృత్వంలోని ఓ బృందం పూరీ జగన్నాథ ఆలయాన్ని సందర్శిస్తారని పేర్కొన్నారు.