ఫొని విధ్వంసం : దెబ్బతిన్న పూరీ ఆలయం.. 34కు చేరిన మృతులు..
Recommended Video
భువనేశ్వర్ : ఫొని తుఫాను సృష్టించిన బీభత్సం కనీవినీ ఎరుగని నష్టం మిగిల్చింది. ఒడిశాను అతలాకుతలం చేసిన తుఫాను కోలుకోలేని దెబ్బ తీసింది. ఫొని కారణంగా పూరీలోని 12వ దశాబ్దానికి చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జగన్నాథ ఆలయం స్వల్పంగా ధ్వంసమైంది. ప్రధాన కట్టడానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లనప్పటికీ తనిఖీలు నిర్వహించాలని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఆలయ అధికారులు లేఖ రాశారు.
ఒడిశాలో ప్రధాని మోడీ.. ఫొని ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే..
దెబ్బతిన్న ప్రధాన ద్వారం
ఫొని ప్రభావంతో వీచిన పెనుగాలులు, భారీ వర్షాల కారణంగా పూరీ ఆలయ ప్రధాన ద్వారమైన జయ్ విజయ్ ద్వారం ధ్వంసమైంది. ద్వారంలోని జయుడు విగ్రహానికి కొంత మేర నష్టం వాటిల్లగా.. విజయ్ విగ్రహానికి ఎలాంటి ముప్పు కలగలేదు. ఆలయ ప్రాంగంలోని కల్పబాటగా పిలిచే భక్తుల కోరికలు తీర్చే మర్రిచెట్టు కూడా తుఫాను కారణంగా కొంత మేర విరిగిపోయింది.
తుఫాను కారణంగా 24మంది మృతి
ఇదిలా ఉంటే ఫొని తుఫాను ప్రభావంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 34 మంది చనిపోయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అనధికార లెక్కల ప్రకారం ఈ సంఖ్య 45పైనే ఉండొచ్చని తెలుస్తోంది. ఇక ఫొని ఎఫెక్ట్తో రాష్ట్రంలోని 14 జిల్లాలో దాదాపు కోటీ 7లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వారంతా సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
బాధితులకు సీఎం పరామర్శ
ఫొని కారణంగా అతలాకుతలమైన ప్రాంతాల ప్రజలను ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పరామర్శఇంచారు. ఇప్పటికే రెండుసార్లు పూరీని సందర్శించిన ఆయన.. ఆదివారం తీర ప్రాంతంలోని మత్స్యకారుల కాలనీకి వెళ్లారు. అక్కడ తుఫాను బాధితులకు అందుతున్న సాయం, సహయక చర్యలను పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. పూరీ, కుర్దాలో ఫొని బాధితులకు 50కిలోల బియ్యం, రెండు వేల రూపాయల నగదు, పాలిథీన్ కవర్లు అందజేయాలని నిర్ణయించారు. తుఫాను కారణంగా పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు రూ.95వేల చొప్పున పరిహారం ప్రకటించారు.