కుప్పకూలిపోయిన జగ్వార్ యుద్ద విమానం
అలహాబాద్: భారత వైమానిక దళానికి చెందిన యుద్ద విమానం ఆకస్మికంగా కుప్పకూలిపోయింది. అయితే ఇద్దరు పైలెట్లు ప్రాణాలతో బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ నగరం సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్పారు.
అలహాబాద్ లోని ఎయిర్ ఫోర్స్ కేంద్రం నుండి మంగళవారం ఉదయం 7.25 నిమిషాలకు జాగ్వార్ యుద్ద విమానం బయలుదేరింది. అందులో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. నిత్యం నిర్వహించే శిక్షణలో భాగంగానే ఈ విమానం బయలుదేరింది.
అయితే అలహాబాద్ ఎయిర్ పోర్స్ కేంద్రం కు 13 కిలోమీటర్ల దూరంలోని ఒక గ్రామం దగ్గర యుద్ద విమానంలో సాంకేతిక లోపం రావడంతో పైలెట్లు విషయం గుర్తించారు. కచ్చితంగా ప్రమాదం జరుగుతుందని తెలుసుకున్న పైలెట్లు కిందకు దూకేశారు.
తరువాత యుద్ద విమానం గ్రామం సమీపంలోని నిర్జన ప్రదేశంలో కుప్ప కూలిపోయింది. రెండు ఇంజన్లు సామర్థ్యం ఉన్న జాగ్వార్ యుద్ద విమానం ఎందుకు కూలిపోయిందనే విషయంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంవత్సరం మార్చి నెలలో హర్యానాలోని కురుక్షేత్ర సమీపంలో జాగ్వార్ యుద్ద విమానం కూలిపోయింది. ఇప్పుడు మరొ జాగ్వార్ యుద్ద వివమానం కూలిపోయింది. ఈ సంవతర్సరం ఇది రెండవది.