పూరీ పురవీధుల్లో జగన్నాథ రథయాత్ర.. కృప అందాలన్న మోడీ, షా దంపతుల పూజలు (వీడియో)
Recommended Video
పూరీ/ అహ్మదాబాద్ : ఆషాడ శుక్త విదియ రోజున ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి రథయాత్ర ఆశేష భక్తజనం మధ్య ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి 9 రోజులపాటు రథయాత్ర వేడుకలు జరుగుతాయి. ఏడాదిపాటు ఆలయ గర్భాలయంలో ఉండే జగన్నాథుడు తన సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రుడితో కలిసి పూరీ వీధుల్లో విహరిస్తున్నారు.
కన్నులపండువగా ..
పూరీలో జరిగే జగన్నాథ రథయాత్రను కనులారా వీక్షించేందుకు దేశవిదేశాల నుంచి లక్షలాది జనం తరలొచ్చారు. ఇసుకవేస్తే రాలనంత జనం పూరీవీధుల్లో కనిపిస్తున్నారు. పూరీ జగన్నాథ ఆలయం ఎదుట ఉండే పెద్దవీధి మీదుగా మూడు కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరం వరకు రథయాత్ర సాగుతుంది. రథయాత్రలో దాదాపు 2 లక్షల మంది భక్తులు పాల్గొంటారని పోలీసులు అంచనా వేశారు. మరోవైపు నిఘాసంస్థల హెచ్చరికలతో రథయాత్రకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ కోసం 10 వేల మంది పోలీసులను మొహరించారు. పూరీకి వచ్చే వాహనాలను అన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
మోడీ ట్వీట్ ..
పూరీలో జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమవడంతో ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. గుజరాత్, ఒడిశా .. దేశంలోని ఇతర ప్రాంతాల్లో జగన్నాథుడి ఊరేగింపు కొనసాగుతుందని పేర్కొన్నారు. రథయాత్ర సందర్భంగా జగన్నాథుడి కృప ప్రజలకు అందాలని కోరుకున్నారు. అందరూ మంచి ఆరోగ్యంతో, సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ట్వీట్లో ఇదివరకు మోడీ రథయాత్రలో పాల్గొన్న ఫోటోను షేర్ చేశారు. అందులో ఆయన ఊదారంగు వస్త్రాలు ధరించి .. నదీ మధ్యలో ప్రార్థిస్తున్నట్టు ఉంది.
షా దంపతుల పూజలు ..
మరోవైపు కేంద్రహోంమంత్రి అమిత్ షా దంపతులు అహ్మదాబాద్ జమల్పుర్లో జరిగిన రథయాత్రలో పాల్గొన్నారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి గుజరాత్ వచ్చారు. ఇక్కడ 142వ సారి రథయాత్ర జరుగుతుంది. ఇర్రడ 19 ఏనుగులు, 100 ట్రక్కులు, దాదాపు 30 మంది సభ్యులు పాటలు పాడుతుండగా వైభవంగా రథయాత్ర జరుగుతుంది. ఐబీ హెచ్చరికలతో దాదాపు 25 వేల మందితో భద్రత కల్పించారు. సీసీటీవీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సెక్యూరిటీ కోసం డ్రోన్లను కూడా వాడుతున్నారు.