శశికళను కలుసుకొనేందుకు బంధువులకు అనుమతి నిరాకరణ, కారణమిదే?
అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళను కలుసుకొనేందుకు ఆమె బంధువులు చేసుకొన్న ధరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు. జయలలిత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళపాటు శశికళ కర్ణాటక జైలులో శిక్షను అనుభవిస్తోంది.
చెన్నై:అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళను కలుసుకొనేందుకు ఆమె బంధువులు చేసుకొన్న ధరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు. జయలలిత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళపాటు శశికళ కర్ణాటక జైలులో శిక్షను అనుభవిస్తోంది.
కర్ణాటక రాష్ట్రంలోని పరప్పర ఆగ్రహర జైలులో శశికళ శిక్షను అనుభవిస్తోంది. అయితే శశికళను ఆమె బంధువులు, స్నేహితులు, పార్టీ నాయకులు నిబంధనలకు విరుద్దంగా కలుస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుండి మార్చి 18వ. తేది వరకు 28 మంది కలుసుకొన్నారని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. ఈ విషయమై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.
నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన జైలు అధికారులపై 15 రోజుల్లోపుగా చర్యలు తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని సామాజికి కార్యకర్త నరసింహమూర్తి ప్రకటించారు.
ఈ ప్రకటన జైలు అధికారుల్లో భయానికి కారణమైంది.శశికళను కలుసుకొనేందుకు గాను వివేక్ , రాజరాజన్, శివకుమార్, కార్తికేయన్ తో పాటు అన్నాడిఎంకె (అమ్మ) పార్టీ నాయకులు ధరఖాస్తు చేసుకొన్నారు.
తరచుగా శశికళను కలుసుకొనే వీలులేదని జైలు అధికారులు స్పష్టం చేశారు. ప్రతి 15 రోజులకు ఒక్కసారి మాత్రమే శశికళను కలుసుకొనేందుకు వీలు కల్పిస్తామని చెప్పారు.
మరో వైపు అన్నాడిఎంకె (అమ్మ) పార్టీకి చెందిన కర్ణాటక శాఖకు చెందిన నాయకుడు పుహళేంది జైలు అధికారులతో మంతనాలు జరుపుతున్నారు. శశికళను ఆమె బంధువులు కలుసుకొనేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారని సమాచారం.