బార్ డ్యాన్సర్ని టచ్ చేస్తే రూ.50వేల జరిమానా
ముంబై: మహారాష్ట్రలో బార్ డ్యాన్సర్లను ఉద్దేశ్యపూర్వకంగా ముట్టుకుంటే భారీ జరిమానా, జైలు శిక్ష విధిస్తారు. ముంబై డ్యాన్స్ బార్లలో డ్యాన్సర్లను ముట్టుకున్నా, వారితో అసభ్యంగా ప్రవర్తించినా రూ.50 వేల జరిమానా లేదా ఆర్నెల్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విధాన్ భవన్ వద్ద నిర్వహించిన సమావేశంలో బార్లకు సంబంధించి రూపొందించిన ముసాయిదా బిల్లు గురించి వివరించారు. డ్యాన్స్ బార్లను రద్దు చేయాలన్న మహా ప్రభుత్వం నిర్ణయాన్ని సుప్రీం కోర్టు కొద్ది రోజుల క్రితం తిరస్కరించింది.
దీంతో డ్యాన్స్ బార్ల విషయమై పాతిక మంది సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. కఠినమైన విధానాలు రూపొందిస్తోంది. డ్యాన్స్ బార్, రెస్టారెంట్ల ముందు సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని, ఫుటేజ్లు ఆయా రెస్టారెంట్ల యాజమాన్యం దగ్గర నెల రోజుల పాటు ఉండాలని ముసాయిదా బిల్లులో పేర్కొన్నారు.
బార్ యజమాని వినియోగదారులను డ్యాన్సర్లతో అమర్యాదకరంగా ప్రవర్తించేందుకు ప్రోత్సహిస్తే వారికి రూ.10లక్షల జరిమానా, మూడేళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది. డ్యాన్స్ బార్లు అర్ధరాత్రి రెండు గంటల వరకు తెరిచేలా అనుమతించిన ప్రభుత్వం ఇప్పుడు రాత్రి పదకొండున్నర తర్వాత మూసేయాలని నిర్ణయించింది.
డ్యాన్సర్లు డ్రగ్స్ తీసుకోవడానికి వీల్లేదు. బార్లలో పని చేసే అందరి పూర్తి వివరాలు ఉండాలి. పాతికేళ్లలోపు యువతులను బార్లోకి అనుమతించరాదు. అసభ్యకర నృత్యాలు, దుస్తులకు అనుమతిలేదు. డ్యాన్సర్లు నృత్యం చేసే ఫ్లోర్కి, కస్టమర్లు కూర్చునే సీట్లకి దాదాపు ఐదు అడుగుల దూరం ఉండాలి. కస్టమర్లు స్టేజ్ పైకి వెళ్లొద్దు.