ఇది కథ కాదు! వివాహితతో ప్రేమ, ఆమె భర్తను చంపి జైలుకు..: 14ఏళ్ల తర్వాత డాక్టర్గా సుభాష్
బెంగళూరు: డాక్టర్ కావాన్నది అతని చిన్ననాటి కల. అయితే, అనుకోకుండా ఓ హత్య చేసి, ఆ కేసులో 14 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించాడు. అయినప్పటికీ తన చిన్ననాటి స్వప్నాన్ని వీడలేదు. జైలు నుంచి విడుదలయ్యాక వైద్యుడు కావాలన్న తన కలను సాకారం చేసుకున్నాడు.
వివాహితతో ప్రేమలో..
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక కలబురిగికి చెందిన సుభాష్ పాటిల్ 1997లో ఎంబీబీఎస్లో చేరాడు. ఆ సమయంలోనే తన ఇంటికి సమీపంలో ఉండే పద్మావతి అనే మహిళతో ప్రేమలో పడ్డాడు. అయితే, అప్పటికే ఆమెకు వివాహమైంది. వీరి ప్రేమ వ్యవహారం ఆమె భర్తకు తెలియడంతో.. పాటిల్ను పద్ధతి మార్చుకోమంటూ అతడు బెదిరించాడు.
ఆమె భర్తను చంపి.. జైలుకు..
ఈ క్రమంలో సుభాష్, పద్మావతి కలిసి పక్కా ప్లాన్ ప్రకారం ఆమె భర్తను హత్య చేశారు. ఈ హత్య కేసులో సుభాష్ పాటిల్, పద్మావతిలు దోషులుగా తేలడంతో 2002లో వారికి జీవిత ఖైదు విధించింది కోర్టు. అప్పటికే ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న సుభాష్ చదువు అక్కడితో ఆగిపోయింది.
14ఏళ్లపాటు జైలులోనే..
కాగా, సత్ప్రవర్తన కారణంగా సుభాష్ పాటిల్ను 14ఏళ్ల తర్వాత 2016లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జైలు నుంచి విడుదల చేశారు. బయటకు వచ్చిన సుభాష్ పాటిల్ డాక్టర్ కావాలన్న తన చిన్ననాటి కలను సాకారం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం తాను మధ్యలో వదిలేసిన ఎంబీబీఎస్ కొనసాగిస్తానని సదరు యూనివర్సిటీకి విన్నవించుకున్నాడు.
పట్టువిడవకుండా 14ఏళ్ల తర్వాత వైద్యుడిగా...
2016లో ఎంబీబీఎస్లో చేరిన సుభాష్ పాటిల్.. 2019లో పూర్తి చేశాడు. తాజాగా ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడిక పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందించేందుకు సిద్ధమయ్యాడు. వైద్యుడిగా ప్రజలకు మంచి సేవలు అందించడమే తన ముందున్న లక్ష్యమని చెబుతున్నాడు. క్షణికావేశంలో తప్పులు చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. ప్రస్తుతం పాటిల్కు 40 ఏళ్లు. కాగా, యువకుడిగా ఆవేశంలో చేసిన తప్పునకు జైలు శిక్ష అనుభవించిన సుభాష్ పాటిల్.. తన కలను మరవకుండా ఎంతో కష్టపడి నెరవేర్చుకోవడం పట్ల పలువురు ఆయనను అభినందిస్తున్నారు.