ఖైదీ భర్తతో ఏకాంతంగా గడపాలని!: లంచం ఇచ్చి హోటల్లో.. కానిస్టేబుళ్లకు దిమ్మతిరిగే షాక్
తనకు సహకరించినందుకు గాను తన భార్య కానిస్టేబుళ్లకు రూ.1లక్షల లంచంగా ఇచ్చిందని తెలిపాడు.
ముంబై: తలోజా జైల్లో ఖైదీగా శిక్ష అనుభవిస్తూ.. వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లిన సమయంలో తప్పించుకున్న గ్యాంగ్ స్టర్ పాటిల్ పోలీస్ విచారణలో విస్తుపోయే విషయాలు వెల్లడించాడు. అతని పరారీ వెనుక పోలీసుల పాత్ర ఉందని నిర్దారించుకున్న ఉన్నతాధికారులు అందుకు సహకరించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.
సిడ్కో ఉద్యోగిని హత్య చేసిన కారణంగా 2013లో గ్యాంగ్ స్టర్ హనుమాన్ పాటిల్ ను అరెస్టు చేసి తలోజా జైలుకు తరలించారు. ఆస్తి వివాదం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లుగా ఆరోపణలున్నాయి. తలోజా జైల్లో శిక్ష అనుభవిస్తున్న పాటిల్ ను అదే ఏడాది ఫిబ్రవరి 11న వైద్య పరీక్షల నిమిత్తం జేజే ఆసుపత్రికి తీసుకొచ్చారు.
ఆ సమయంలో మందులు కొనుగోలు చేసేందుకు అనుమతించాలని జేజే ఆసుపత్రి వద్ద ఉన్న అధికారిని పాటిల్ కోరాడు. ఇందుకు ఓకె చెప్పిన సదరు అధికారి.. ఇద్దరు కానిస్టేబుళ్లను వెంట ఇచ్చి పంపించాడు. అయితే పాటిల్ భార్య వద్ద అప్పటికే రూ.1లక్ష లంచం తీసుకున్న కానిస్టేబుళ్లు.. అతన్ని నేరుగా ఓ హోటల్కు తీసుకెళ్లారు.
అంతకుముందు పాటిల్ భార్య మొనాలి వారిని సంప్రదించి.. తన భర్తతో మూడు గంటల పాటు ఏకాంతంగా గడపాలని వారిని కోరినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏర్పాట్లు చేసిన కానిస్టేబుళ్లు ఆమె వద్ద లంచం తీసుకుని ఇద్దరిని బ్రైట్ వే హోటల్లో కలిసే విధంగా ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే పాటిల్ను హోటల్కు తీసుకెళ్లి అతని భార్యతో కలిపారు.
దాదాపు మూడు గంటల తర్వాత పోలీసులు ఆ గది డోర్ ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా.. గదిలో ఒక్కరే ఉన్నట్లు తేలింది. అప్పటికే పాటిల్ అక్కడి నుంచి పరారయ్యాడు. అలా తప్పించుకున్న పాటిల్ను గత నెలలో యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఎలా తప్పించుకున్నావని ఆరా తీయగా.. కానిస్టేబుళ్లు సహకరించిన విషయాన్ని వెల్లడించాడు. దీంతో లంచం తీసుకున్న ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది.