జైల్లో తండ్రి, పరీక్షల్లో కూతురు టాపర్, ఎవరామె?
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు షబ్బీర్ అహ్మద్ షా కూతురు తాజాగా విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో టాపర్గా నిలిచింది. ఉగ్రవాదులకు నిధులను అందిస్తుందనే కేసులో షబ్బీర్ అహ్మద్ ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు.
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలను మే 26 వ తేదిన విడుదల చేశారు. ఈ ఫలితాల్లో జమ్మూ కాశ్మీర్ వేర్పాటు వాద నేత షబ్బీర్ అహ్మద్ కూతురు 97.98 శాతం మార్కులతో టాపర్ గా నిలిచింది.
జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో షబ్బీర్ అహ్మద్ కూతురు చదువుతోంది. జమ్మూకశ్మీర్ డెమొక్రటిక్ ఫ్రీడమ్ పార్టీ నేత అయిన షబ్బీర్ అహ్మద్ షాను ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్న కేసులో 2017 జూలై 26న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. టాపర్గా నిలిచిన సమాను ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అభినందించారు.
వేర్పాటువాద ఉద్యమ నాయకుడిగా షబ్బీర్ అహ్మద్ ఉన్నాడు. అయితే ఆయన కూతురు మాత్రం విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడం పట్ల పలువురు ఆమెను అభినందల్లో ముంచెత్తారు. కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ, ఆ ప్రభావం తన చదువుపై కన్పించడకుండా సమ పట్టుదలగా చదివి 12 వతరగతి పరీక్షల్లో టాపర్ గా నిలవడం పట్ల పలువురు ఆమెను అభినందించారు.