బెంగళూరులో జైన్ మందిరం దగ్గర హిందీ బ్యానర్లు చించేశారని కేసు, కన్నడ లీడర్స్ అరెస్టు!
బెంగళూరు: బెంగళూరులోని జైన్ ప్రార్థనా మందిరం దగ్గర గొడవ చేసి హిందీలో రాసిన పెట్టిన బ్యానర్లు చించివేశారని ఆరోపిస్తూ కన్నడ సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. జైన్ మతస్తులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేసి కన్నడ సంఘాల నాయకులను జైలుకు పంపించామని పోలీసులు తెలిపారు. జైన్ మతస్తులకు మద్దతుగా కేంద్ర మంత్రి డివి. సదానందగౌడ, బెంగళూరు దక్షిణ లోక్ సభ నియోజక వర్గం ఎంపీ (బీజేపీ) తేజస్వి సూర్య ట్వీట్ చెయ్యడంతో వారి మీద కన్నడ సంఘాలు మండిపడుతున్నాయి.
బెంగళూరు నగరంలోని ఇన్ఫాంట్రీ రోడ్డు సమీపంలోని జైన్ మతస్తులకు చెందిన గణేష్ బాగ్ ప్రార్థనా మందిరం ఉంది. జైన్ ప్రార్థనా మందిరం దగ్గర హిందీలో రాసిన బ్యానర్లు కట్టారు. ఈ విషంయంపై కన్నడ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కన్నడలో బ్యానర్లు కట్టాలని జైన్ మతస్తులకు సూచించారు.
ఆ సమయంలో జైన్ మతస్తులు, కన్నడ సంఘాల నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ సందర్బంలో కన్నడ సంఘాల నాయకులు బలవంతంగా హిందీలో రాసిన బ్యానర్లు అక్కడి నుంచి తొలగించడానికి ప్రయత్నించారని, ఆ సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన మా మత గురువుల ఫోటోలకు హాని జరిగిందని జైన్ మతస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జైన్ మతస్తుల ఫిర్యాదు మేరకు కర్ణాటక రణధీర విభాగం రాష్ట్ర అధ్యక్షుడు హరీష్ కుమార్, నాయకులు మంజు, చంద్రశేఖర్, కర్ణాటక రక్షణా వేదిక నాయకులు అంజనప్ప, కన్నడ రక్షణా సేన నాయకుడు రమేష్ గౌడ, కరునాడు సేవకర వేదిక నాయకుడు మాదేశ్ గౌడను పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టు చేసిన కన్నడ సంఘాల నాయకులను న్యాయమూర్తి ముందు హాజరుపరిచి జైలుకు పంపించామని కమర్షియల్ స్ట్రీట్ పోలీసులు తెలిపారు. జైన్ ప్రార్థనా మందిరం దగ్గర హిందీలో రాసి అక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్లను కన్నడ సంఘాల నాయకులు బలవంతంగా తొలగించారని జైన్ మతస్తులు ఆరోపించారు.
ఆ సమయంలో తాము వీడియో తీశామని జైన్ మతస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జైన్ మతస్తులు ఇచ్చిన వీడియో ఆధారంగా పోలీసులు కన్నడ సంఘాల నాయకులను అరెస్టు చేశారు. కన్నడ సంఘాల నాయకులను అరెస్టు చెయ్యడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం సాయంత్రం బెంగళూరులోని టౌన్ హాల్ ముందు పెద్ద ఎత్తున ధర్నాకు కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి.