రాయల టీకి వ్యతిరేకం: జైపాల్ రెడ్డి, బాబుకు సూచన
ప్రస్తుత దశలో రాయల తెలంగాణ ప్రతిపాదన తేవడం సరైంది కాదని జైపాల్ రెడ్డి అన్నారు. రాయల తెలంగాణ అనేది తెలంగాణ ప్రజలకు గానీ అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలకు గానీ శ్రేయస్కరం కాదని ఆయన అన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను తాను అన్ని స్థాయిల్లో తన శక్తి కొలదీ వ్యతిరేకిస్తానని ఆయన చెప్పారు. రాయల తెలంగాణ ప్రతిపాదన ఎన్నాళ్ల నుంచో ఉందని, అయితే అధికారికంగా ఎప్పుడూ చెప్పలేదని ఆయన అన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన వాంఛనీయం కాదని ఆయన అన్నారు.
సిడబ్ల్యుసి గానీ మంత్రి వర్గం గానీ రాయల తెలంగాణ ప్రతిపాదనకు తీర్మానం చేయలేదని, జులై 30వవ తేదీన సిడబ్ల్యుసి చేసిన ప్రతిపాదనే విభజనకు కొలబద్దంగా ఉండాలని జైపాల్ రెడ్డి అన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన తెలంగాణ, రాయలసీమ ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తుందని అన్నారు. చారిత్రకంగా తెలంగాణ పది జిల్లాలతో ఉందని, దాన్ని మార్చవద్దని ఆయన అన్నారు. నదీ జలాల విషయంలో రాయలసీమకు అన్యాయం జరగదని, అన్యాయం జరుగుతుందనేది ఆధారరహితమని అన్నారు.
హైదరాబాదును కేంద్ర పాలితంగా ప్రాంతంగా చేయాలనే ప్రతిపాదనను ఏకగ్రీవంగా తెలంగాణవాళ్లంతా వ్యతిరేకించారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హైదరాబాద్ యుటి కాదని కాంగ్రెసు అధిష్టానం నిర్ణయించిందని ఆయన చెప్పారు. న్యాయాన్యాయాల గురించి ఈ దశలో మాట్లాడడం సరి కాదని, దేశంలో రాజ్యంగమూ చట్టమూ ఉన్నాయని, రాయలసీమ జిల్లాలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వస్తుందని నమ్ముతున్నానని ఆయన చెప్పారు. బిల్లు తయారు కాలేదు కాబట్టి, మంత్రివర్గం ఆమోదించి రాష్ట్రపతికి పంపించలేదని, ఈ దశలో పార్లమెంటులో బిల్లును ప్రతిపాదిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ చెప్పలేరని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా వివరణ ఇచ్చారు.
కృష్ణా నదీ జాలలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలను ఆయన తప్పు పట్టారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఓ పౌరుడైనా విమర్శించవచ్చు, విశ్లేషించ వచ్చునని ఆయన అన్నారు. ట్రిబ్యునల్కు కూడా న్యాయవ్యవస్థ స్థాయి ఉంటుందని, అందువల్ల బ్రిజేష్ కుమార్కు చంద్రబాబు ఉద్దేశాలు ఆపాదించడం సరి కాదని ఆన అన్నారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు విషయంలో జోక్యం చేసుకోవాలని చంద్రబాబు, కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు అడుగుతున్నారని, న్యాయవ్యవస్థను ప్రభావితం చేయాలని చూడడం సరి కాదని ఆయన అన్నారు. వీరప్ప మొయిలీ, తదితరులపై చంద్రబాబు విమర్శలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. న్యాయ, రాజ్యాంగ నిపుణులను సంప్రదించి సరైన విధంగా వ్యవహరించాలని ఆయన చంద్రబాబుకు సూచించారు.