Airforce One:ఢిల్లీ ఎయిర్పోర్టులో వాతావరణం అనుకూలించకపోతే ట్రంప్ విమానం ల్యాండింగ్ ఇక్కడే..!
జైపూర్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈనెల 24, 25 తేదీల్లో భారత పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా అహ్మదాబాద్ చేరుకోనున్న ట్రంప్ ఆ తర్వాత ఆగ్రాకు వెళతారు. ఇక ఢిల్లీ విమానాశ్రయంలో వాతావరణం అనుకూలించకపోతే ట్రంప్ ఎయిర్ఫోర్స్ వన్ విమానం దిగేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో వాతావరణం అనుకూలించకపోతే జైపూర్ విమానాశ్రయంలో ఎయిర్ఫోర్స్ వన్ ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేశారు.
ఇప్పటికే జైపూర్ విమానాశ్రయంను పరిశీలించేందుకు అమెరికా ఎంబసీ నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన బృందం చేరుకుంది. ఆ తర్వాత మరో నలుగురు సభ్యులతో కూడిన బృందం కూడా వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షించింది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇతరత్ర సదుపాయాలపై ఆరా తీసింది. ఇదిలా ఉంటే జైపూర్ విమానాశ్రయంపై సమీక్ష జరిపిన అమెరికా ఎంబసీ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
వీవీఐపీలకు కావాల్సిన సదుపాయాలన్నీ జైపూర్ విమానాశ్రయంలో ఉన్నాయని జైపూర్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జైదీప్ సింగ్ బల్హారా చెప్పారు. వీవీఐపీల విమానాల పార్కింగ్కు ప్రత్యేక పార్కింగ్ స్లాట్ ఉందని చెప్పారు. వీవీఐపీల విమానాల ల్యాండింగ్కు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఫిబ్రవరి 23 నుంచి ఫిబ్రవరి 25వరకు అలర్ట్గా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు విమానాశ్రయం అధికారులు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సంబంధించిన సెక్యూరిటీ మొత్తం ఓ విమానంలో వస్తుండగా ఆ విమానం ఫిబ్రవరి 23న జైపూర్లో ల్యాండ్ కానుంది. ఒకవేళ ట్రంప్ ప్రయాణిస్తున్న ఎయిర్ఫోర్స్ వన్ విమానం జైపూర్లో ల్యాండ్ అయితే భద్రతా సిబ్బంది ఆయనకు భద్రత కల్పిస్తారు. వీరిని రిజర్వ్లో ఉంచారని ఎయిర్పోర్టు అధికారులు చెప్పారు.