మహిళపై చేయి చేసుకోవడంతో ఉద్రిక్తత: స్థానికులు, పోలీసుల మధ్య ఘర్షణ, పోలీస్ మృతి
ఓ మహిళపై పోలీసు చేయిచేసుకోవడంతో మొదలైన వివాదం.. హింసాత్మకంగా మారింది.స్థానికులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది.
జైపూర్: ఓ మహిళపై పోలీసు చేయిచేసుకోవడంతో మొదలైన వివాదం.. హింసాత్మకంగా మారింది.స్థానికులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. రాజస్థాన్లోని కోట జిల్లా రామ్గంజ్లో శుక్రవారం నుంచీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు ద్విచక్రవాహనంపై వస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్కి తరలించారు. విషయం తెలుసుకున్న అతని కుటుంబసభ్యులు, స్థానికులు పెద్దఎత్తున పోలీసుస్టేషన్కి చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలో ఓ మహిళపై పోలీసు చేయిచేసుకున్నాడు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. ఘటనాస్థలికి వచ్చిన 108 అంబులెన్స్ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఓ పోలీసు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.
పరిస్థితులు చేయిదాటిపోవడంతో ఈ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.