రైల్వే స్టేషన్స్ ర్యాంకింగ్స్: హైదరాబాద్, సికింద్రాబాద్ కంటే విజయవాడే బెటర్!
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా స్వచ్ఛ రైల్వే స్టేషన్ల ర్యాంకుల జాబితాను కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ బుధవారం విడుదల చేశారు. ఈ జాబితాలో రాజస్థాన్ రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు వరుసగా టాప్ 3లో స్థానం దక్కించుకోవడం విశేషం.
ప్రయాణికులకు షాక్: రైల్వే ప్లాట్ఫాం టికెట్ రేట్లు భారీగా పెంపు
దేశంలోని రైల్వే స్టేషన్ల స్వచ్ఛతపై నిర్వహించిన సర్వే నివేదికను పీయూష్ గోయల్ విడుదల చేయగా.. ఆ నివేదిక ప్రకారం.. జయపుర(జైపూర్) రైల్వే స్టేషన్కు ప్రథమ ర్యాంకు లభించింది. ఈసారి మొత్తం 720 రైల్వే స్టేషన్లలో సర్వే నిర్వహించగా.. రాజస్థాన్లోని జైపూర్ మొదటి స్థానం, జోధ్పూర్, దుర్గాపుర రైల్వే స్టేషన్లు తర్వాతి రెండు స్థానాలను దక్కించుకున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లకు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది. విజయవాడ రైల్వే స్టేషన్ ఏడో ర్యాంకు దక్కించుకోగా.. హైదరాబాద్ రైల్వే స్టేషన్ 17వ ర్యాంకులో నిలిచింది. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 42వ స్థానం దక్కించుకుంది.
ఇక 109 సబర్బన్ రైల్వే స్టేషన్లలో అంధేరి, విరార్, నయిగాం రైల్వే స్టేషన్లు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. 2016 నుంచి రైల్వే శాఖ ఏటా 407 ప్రధాన రైల్వే స్టేషన్లలో స్వచ్ఛత అంశంపై థర్డ్ పార్టీతో సర్వే చేయిస్తోంది. అయితే, ఈసారి మాత్రం తొలిసారిగా 720 రైల్వే స్టేషన్లు, సబర్బన్ రైల్వే స్టేషన్లలో సర్వే చేపట్టి ర్యాంకులను ప్రకటించింది.