Jaipur Literature Fest 2021: మైఖేల్ శాండెల్ పుస్తకంపై శశి థరూర్ ప్రశంసలు
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిటరేచర్ ఫెస్టివల్ జైపూర్ లిటెరేచర్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ప్రపంచంలోని పలు రంగాలకు చెందిన మేధావులు, సాహిత్యవేత్తలు, మానవతావాదులు, రాజకీయనాయకులు, పారిశ్రామిక వేత్తలనే ఒకే వేదికపైకి తీసుకొస్తుంది ఈ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్. ఈ వేదికపై వీరంతా తమ సృజనాత్మకతమైన ఆలోచనలను పంచుకుంటారు. మంచి చర్చను చేపడతారు. ఈ ఏడాది జరగబోయే లిటరరీ ఫెస్ట్కు డిజిటల్ మీడియా పార్ట్నర్లుగా డైలీహంట్ మరియు వన్ఇండియా న్యూస్ పోర్టల్లు వ్యవహరించనున్నాయి. ఈ కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రసారం చేయనున్నాయి.
Recommended Video
గతంలో జరిగిన జైపూర్ సాహిత్య ఉత్సవాల్లో భారత్కు చెందిన రచయిత, సామాజికవేత్త అయిన హర్ష్ మందర్, తాను రాసిన పుస్తకం లాకింగ్ డౌన్ ది పూర్: ది పాండెమిక్ అండ్ ఇండియాస్ మోరల్ సెంటర్ పై చర్చ జరిగింది. సామూహిక హింస బారిన పడిన బాధితులను, ఆకలితో అలమటిస్తున్నవారితో, ఉండేందుకు ఇళ్లు లేక వీధుల్లో నిద్రిస్తున్న వారితో కలిసి తాను చేసిన ప్రయాణం, తన అనుభవాలను పంచుకున్నారు. అంతేకాదు తాను రాసిన పుస్తకంలో కూడా పొందుపర్చారు. ఈ రోజు జరిగిన జైపూర్ సాహిత్య ఉత్సవాల్లో ప్రముఖ ఫిలాసఫర్ మైఖేల్ శాండెల్ లోక్సభ ఎంపీ శశి థరూర్తో తన అభిప్రాయాలను అనుభవాలను పంచుకున్నారు. సమకాలిన రాజీకాయలపై ఈ ఇద్దరు చర్చించారు.
ఈ రోజు జరిగిన సెషన్లో ఎంపీ శశి థరూర్ హార్వర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ మైఖేల్ శాండెల్తో చర్చించారు. శాండెల్ రాసిన పుస్తకం "ది టైరానీ ఆఫ్ మెరిట్: వాట్స్ బికమ్ ఆఫ్ ది కామన్ గుడ్" అనే పుస్తకంపై చర్చించారు. రాజకీయాల్లో విజేతలు, ఓటమి ఎదుర్కొన్న వారి గురించి చర్చించారు. శాండెల్ పుస్తకాలను చాలా ఏళ్లుగా తాను చదువుతున్నట్లు చెప్పుకొచ్చారు శశి థరూర్. మెరిట్ అనే అంశంపై ఓ సరికొత్త చర్చకు తెరలేపారు శాండెల్. అర్హత లేదా యోగ్యత అనేది చాలా సమస్యాత్మకమైనదని, ఎందుకంటే ఇది అసమానత్వపు సమాజంలో ఎక్కడ కనిపించదని గుర్తుచేశారు. అసలు యోగ్యత అనే పదంలోనే సమస్య ఉందని చెప్పారు. యోగ్యత గురించి పలువురు ప్రస్తావించి లేదా ఫిర్యాదు చేసినప్పుడు వారు ఆదర్శం గురించి చేయరని వారు యోగ్యతతో కూడిన జీవితాన్ని అవలంబించడంలో విఫలమవుతున్నారని చెప్పారు.
గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచీకరణ జరుగుతోందని ఇందులో విజేతలుగా కొందరుంటే మరికొందరు ఓటమిని ఎదుర్కొంటున్నారని శాండెల్ చెప్పారు. రాజకీయాల్లో ఇది విషపూరితమైందని గుర్తుచేశారు. పెరుగుతున్న అసమానత్వంతో పాటు సమానంగా మనిషి యొక్క ధోరణి లేదా వైఖరి మారుతోందని గుర్తుచేశారు. ఎవరైతే విజేతలుగా నిలిచారో వారి కష్టంతోనే సక్సెస్ సాధించారనే భావనలో ఉన్నారని శాండెల్ అన్నారు.
ఇదిలా ఉంటే 14వ జైపూర్ సాహిత్య ఉత్సవాలు ఫిబ్రవరి 19వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 21వ తేదీన ముగిశాయి. తిరిగి ఫిబ్రవరి 26న ప్రారంభమై 28వ తేదీన ముగుస్తాయి.