అంతా మహిళలే: దేశంలో తొలి మహిళా రైల్వే స్టేషన్ ఎక్కడుందంటే?
జైపూర్: ఆ రైల్వే స్టేషన్లో అంతా మహిళలే. టీసీ, ఆర్పీఎఫ్, రిజర్వేషన్ అండ్ బుకింగ్ సూపర్ వైజర్స్.. ఇలా మొత్తం 32పోస్టుల్లో మహిళా ఉద్యోగిణులే ఉండటం గమనార్హం. రాజస్థాన్లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్ ఈ ప్రత్యేకతతో ఆకట్టుకుంటోంది.
అంతేగాక, మహిళా ఉద్యోగిణులే ఉన్న దేశంలోని తొలి రైల్వే స్టేషన్గా ఈ రైల్వే స్టేషన్ రికార్డుల్లోకి ఎక్కింది. మహిళా ప్రయాణికుల భద్రతపై దృష్టి సారిస్తూ భారతీయ రైల్వే శాఖ అందర్నీ మహిళా ఉద్యోగులనే ఎంపిక చేసిందని రైల్వే ప్రతినిధి తరుణ్ జైన్ తెలిపారు.
కాగా, ఈ స్టేషన్లో పనిచేస్తున్న మహిళలంతా ఉన్నత శిక్షణ పొందడం గమనార్హం. ఈ రైల్వే స్టేషన్ మీదుగా జైపూర్-ఢిల్లీ వంటి ప్రధాన రైలు మార్గాలు అనుసంధానమై ఉన్నాయి. రోజూ ఈ స్టేషన్ మీదుగా 50రైళ్లు వెళ్తుంటాయి. వీటిలో 25 రైళ్లు ఈ స్టేషన్లో ఆగుతాయి.
కాగా, రోజు దాదాపు 7వేల మంది ప్రయాణిస్తుంటారు. మహిళల సౌకర్యార్థం ఈ స్టేషన్లో సీసీటీవీలు, శానిటరీ న్యాప్కిన్ వెండింగ్ మెషిన్లు ఏర్పాటు చేశారు. ఈ తరహా రైల్వే స్టేషన్లు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ కసరత్తులు చేస్తోంది.