మోడీ కేబినెట్ నుంచి టిడిపి తప్పుకోవాలి: జైరాం, ల్యాండ్ పూలింగ్పై ధర్మాన
న్యూఢిల్లీ/ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై కాంగ్రెసు పార్టీ జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై, తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించే విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైందని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత జైరాం రమేష్ విరుచుకుపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్రంలోని ఎన్డియే ప్రభుత్వం అమలు చేయకపోతే ప్రధాని నరేంద్ర మోడీ మంత్రి వర్గం నుంచి టిడిపి బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రత్యేక హోదా ఇవ్వకుండా బిజెపి సాగదీత వైఖరి కొనసాగిస్తోందని ఆయన విమర్శించారు. యుపిఎ ప్రభుత్వం ఆమోదించిన న్యూక్లియర్ బిల్లును అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వం ఎపికి ప్రత్యేక హోదా బిల్లును ఎందుకు అమలు చేయడం లేదని ఆయన అడిగారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానికి ల్యాండ్ పూలింగ్ చట్ట విరుద్ధమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బృందం అభిప్రాయపడింది. భూసేకరణను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేసింది. రాజధాని భూసేకరణ విషయంలో మొత్తం ఏడు అంశాలపై సిఆర్డిఎ కమిషనర్కు ధర్మాన ప్రసాద రావు నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బృందం ఓ వినతిపత్రం సమర్పించారు. అమాయకంగా ల్యాండ్ పూలింగ్కుక అంగీకరించిన రైతులందరికీ వారి పత్రాలను వెనక్కి ఇవ్వాలని నేతలు కోరారు.
సిఆర్డిఎ పరిధి బయట టిడిపి నేతలు కొన్న వేలాది ఎకరాల భూములపై సిట్గింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు విభజన చట్టం ప్రకారం ప్రభుత్వ భూముల్లో రాజధాని కట్టుకునే అంశాన్ని పరిశీలించాలని వారు కోరారు. రైతులపై అధికారులు, మంత్రులు బెదిరింపులకు, ప్రలోభాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఈ విషయంపై కూడా న్యాయ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.
పదో షెడ్యూల్లోని 94వ నిబంధన ప్రకారం ప్రభుత్వ భూముల్లోనే హైకోర్టు, సచివాలంయ, అసెంబ్లీ నిర్మాణాలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. రైతులు, రైతు కూలీలు, భూమిలేని నిరుపేదలు, వృత్తిదారుల హక్కులను పరిరక్షించాలని వారు కోరారు.