ఎయిర్బేస్లపై ఉగ్రకన్ను: ఎయిర్ఫోర్స్ను అలర్ట్ చేసిన ఇంటెలిజెన్స్ వర్గాలు
న్యూఢిల్లీ: పఠాన్కోట్ ఎయిర్బేస్ తరహాలో ఉగ్రవాదులు ఇతర ఎయిర్బేస్లను లక్ష్యంగా చేసుకున్నారా..? ఎయిర్బేస్లపై ఉగ్రమూకల కన్ను పడిందా..? అంటే అవుననే సమాధానంగా చెబుతున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఎయిర్ఫోర్స్ బేస్లపై ఆత్మాహుతి దాడి చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఈ దాడులు చేసేందుకుగానూ జైషే మహ్మద్ సంస్థ 10 మంది ఉగ్రవాదులకు బాధ్యతను అప్పగించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల విశ్వసనీయ సమాచారం.
ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఏఎఫ్
ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి దాడులు జరుగుతాయనే సమాచారం అందుకున్న ఇండియన్ ఎయిర్ఫోర్స్ ... శ్రీనగర్, అవంతిపూర్, జమ్మూ, పఠాన్కోట్, హిందాన్ ఎయిర్బేస్లలో గట్టి భద్రతా చర్యలు చేపట్టింది. ఇప్పటికే అక్కడ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది ఎయిర్ఫోర్స్. అంతేకాదు అక్కడి భద్రతా పరిస్థితులను సమీక్షించాల్సిందిగా సీనియర్ అధికారులకు ఆదేశాలు జారీచేసింది భారత వైమానిక దళం. పంజాబ్ సరిహద్దుల్లో విమానాల ద్వారా గ్రెనేడ్లు, ఇతర మారణాయుధాలను పాకిస్తాన్ జారవిడుస్తోందని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ను జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
డబ్బులను సమకూర్చుకుంటున్న ఉగ్రవాదులు
భారత్-పాక్ సరిహద్దుల్లో మోహరించిన ఉన్న ఉగ్రవాదులను ఎయిర్బేస్లపై దాడి చేసేందుకు జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ వినియోగించుకుంటోందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ధంగు-పఠాన్కోట్ ప్రాంతాలకు వెళ్లి మిషన్ కోసం కావాల్సిన డబ్బులను కూడా సమకూర్చుకుంటున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సంస్థలోని కొందరు ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్లో కూడా పాగా వేసే అవకాశాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.
కొత్త క్యాంపులు ఏర్పాటు
మరోవైపు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కొత్త క్యాంపులను ఏర్పాటు చేసే పనిలో ఉందని వెల్లడించారు. పాక్ ఆక్రమిత్ కశ్మీర్ (పీఓకే)లోని చామ్, దూద్నియాల్, చిరికోట్, ఆత్ముఖమ్ ప్రాంతాల్లో క్యాంపులను ఏర్పాటు చేయనున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు భారత్లోన గురేజ్ ప్రాంతంలోని లూసర్, దుర్మాత్, తౌబత్లలో కూడా క్యాంపులను యాక్టివ్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు జైషే మొహ్మద్ ఊడి తరహాలో మిలటరీ స్థావరాలే లక్ష్యంగా దాడులకు దిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి.