పఠాన్ కోట్ -2 దాడికి యత్నం: మిలటరీ ఇంటెలిజెన్స్
పంజాబ్: భారత్ లోని వైమానిక దళ స్థావరాల మీద దాడులు చెయ్యడానికి జైష్ -ఈ - అహమ్మద్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. అన్ని వైమానిక దళ స్థావరాల్లో గట్టి నిఘా ఏర్పాటు చెయ్యాలని పంజాబ్ ప్రభుత్వానికి సూచించింది.
పఠాన్ కోట్ దాడిని మరిపించే విధంగా ఆ దాడి చెయ్యాలని ఇప్పటికే ఉగ్రవాదులు కుట్రపన్నారని, ఈ సారి దాడి భారీ స్థాయిలోనే చెయ్యాలని భారత్ లో ఉన్న స్లీపర్ సెల్స్ తో సంప్రధింపులు జరిపారని వెలుగు చూసింది. భారత్ మిలటరీ ఇంటెలిజన్స్ ఈ విషయం పసిగట్టి పంజాబ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
ఈ దాడులకు సంబంధించి భారత్ లో ఉన్న స్లీపర్ సెల్స్ తో భారత్ లోని అన్ని నగరాల్లో రెక్కీ నిర్వహిస్తుందని వెలుగు చూసింది. ఈ దాడికి పాకిస్థాన్ లోని జైష్ -ఈ - అహమ్మద్ ఉగ్రవాదులు, ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదుల సహకారం తీసుకున్నారని తెలిసింది.
భారత్ లో దాడులు చెయ్యడానికి పాకిస్థాన్ లోని జైష్ -ఈ - అహమ్మద్ ఉగ్రవాద కమాండర్ అవాయిస్ మహమ్మద్ ను త్వరలో మలేషియాకు పంపిస్తున్నారని గుర్తించారు. మలేషియాలో నకిలీ పాస్ పోర్టులు తీసుకుని భారత్ వచ్చి ఇక్కడ దాడులకు అతనే నేతృత్వం వహిస్తాడని ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి.
అవాయిస్ మహమ్మద్ పాకిస్థాన్ లోని ఓకారా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడని గుర్తించారు. అతడు మలేషియా నుంచి భారత్ కు చేరుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసింది. మొత్తం మీద భారత్ లోని వైమానిక స్థావరాల దగ్గర పోలీసులు గట్టి బందో బస్తు ఏర్పాటు చేశారు.