జలమార్గంలో దాడులకు జైషే మహ్మద్ కుట్రలు: బుద్ధి చెబుతామన్న నేవీ చీఫ్
పుణె: పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ భారతదేశ తీర ప్రాంతంలో దాడులు చేసేందుకు కుట్రలు పన్నుతోందని తమకు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం ఉందని నావికాదళ అధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్ సోమవారం వెల్లడించారు. జలాంతర విభాగం పేరుతో జైషే మహ్మద్ ఉగ్రవాదులకు సముద్ర మార్గంలో దాడులు చేసేందుకు శిక్షణ ఇస్తోందని చెప్పారు.
ఇంటెలిజెన్స్ సమాచారంతో అప్రమత్తమయ్యామని, సాగరమార్గంలో చొరబాట్లు లేకుండా చూసేందుకు తీర రక్షణకు సంబంధించిన అన్ని విభాగాలు చర్యలు తీసుకుంటున్నాయని నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ తెలిపారు. 2008లో జరిగిన ముంబై దాడుల తర్వాత నావికా దళం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, ఎలాంటి దాడులనైనా తిప్పికొడతామని చెప్పారు.
సముద్ర తీర ప్రాంతాల్లో నావికా దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని, ఉగ్రవాదులు ఎలాంటి దాడులకు ఒడిగిట్టినా తగిన విధంగా బుద్ధి చెబుతామని నేవీ చీఫ్ తెలిపారు. అంతేగాక, హిందూ మహా సముద్రంలో చైనా కదలికలను కూడా తాము నిశితంగా పరిశీలిస్తున్నామని కరంబీర్ సింగ్ చెప్పారు. దేశ భద్రతే తమకు ముఖ్యమని ఆయన అన్నారు.
దేశానికి వ్యతిరేకంగా ఏ శక్తులు పనిచేసినా అణచివేస్తామని నేవీ చీఫ్ స్పష్టం చేశారు. భారత రెండో కల్వరి క్లాస్ స్కార్పిన్ సబ్మెరైన్ వచ్చే నెలలో సేవలందించేందుకు సిద్ధమయ్యే అవకాశం ఉందని చెప్పారు. భారత జల విభాగం పటిష్టంగా ఉందని ఆయన తెలిపారు. నావికా దళానికి బడ్జెట్లో తగిన కేటాయింపులు ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా, పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఈ ఏడాది ఫిబ్రవరి 14న దాడులకు పాల్పడి 42మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. నవంబర్ 26, 2008లో ముంబై తీరం గుండా నగరంలోకి ప్రవేశించిన లష్కరే తొయిబా ఉగ్రవాదులు వరుస దాడులకు పాల్పడటంతో 160 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.