ప్రపంచం వినింది..కానీ జైశంకర్ వినలేదు: ట్రంప్ గురించి మోడీ ఆ స్లోగన్ ఇవ్వలేదా ?
అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ హౌడీ మోడీ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అక్కడ 50వేల మంది భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ ఆబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అనే మాటను చెప్పారు. అయితే మోడీ ఈ పదాన్ని తనకు తానుగా వాడలేదని చెప్పారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్.
ట్రంప్ కోరితేనే ఆ స్లోగన్ ఇచ్చారు
2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మోడీ అక్కడి భారతీయులను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జైశంకర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన గురించి అక్కడ సెటిల్ అయిన భారతీయులకు చెప్పాల్సిందిగా ట్రంప్ కోరడంతోనే మోడీ ఆబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదంను ఉపయోగించారని వెల్లడించారు జైశంకర్.అంతే తప్ప ఈ వ్యాఖ్యలు ప్రధాని మోడీ తనకు తానుగా చెప్పింది కాదని క్లారిటీ ఇచ్చారు జైశంకర్.
వారి రాజకీయం వారిదే మన రాజకీయం మనదే..!
విదేశీ రాజకీయాల్లో భారత్ జోక్యం ఉండదని స్పష్టం చేశారు జైశంకర్. అమెరికాలో ఏది జరిగినా అది వారి రాజకీయమే తప్ప మన రాజకీయం ఉండదని వెల్లడించారు. తనకు గుర్తున్నంత వరకు గతంలో ట్రంప్ ఆబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదంను వాడారని అదే ప్రధాని తిరిగి హూస్టన్ సభలో చెప్పారని జైశంకర్ వెల్లడించారు. అంటే ఇక్కడ ప్రధాని మోడీ గతం గురించి మాత్రమే ప్రస్తావించారన్నది గ్రహించాలని జైశంకర్ వెల్లడించారు. ట్రంప్ కోసం మోడీ ప్రచారం చేశారని విపక్షాలు అనవసరపు ప్రచారం నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.
ఆబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ స్లోగన్పై కాంగ్రెస్ విమర్శలు
ఇదిలా ఉంటే మోడీ హూస్టన్ సభలో ప్రసంగించే సమయంలో ఆబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదం చెప్పడం స్పష్టంగా వినిపించింది. అంతేకాదు వైట్హౌజ్లో దీపావళి వేడుకలు నిర్వహించగానే అక్కడి భారతీయుల్లో ఎంతో సంతోషం ఆనందం వ్యక్తమైందని కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యల తర్వాత మోడీ ట్రంప్ కోసం ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. అయితే కాంగ్రెస్ విమర్శలను బీజేపీ కొట్టిపారేసింది.