భారత్-చైనా సంబంధాలు మెరుగుపడేందుకు చిట్కా ఇదే- విదేశాంగమంత్రి జై శంకర్ సలహా
భారత్, చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు ప్రారంభమై ఏడాది గడిచినా ఇప్పటికీ పరిస్ధితిలో ఎలాంటి మార్పూ లేదు. మధ్యలో గల్వాన్ ఘటనలో భారతీయ సైనికులను చైనా పొట్టన పెట్టుకుంది కూడా. అయినా మిలటరీ స్ధాయిలో జరిగిన చర్చల్లో కానీ, విదేశాంగమంత్రుల స్ధాయిలో జరిగిన చర్చల్లోనూ ఎలాంటి పురోగతి లేదు. దీంతో ప్రతిష్టంభన ఇంకా అలాగే కొనసాగుతోంది.
చైనాతో సరిహద్దు ప్రతిష్టంభనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా భారత విదేశాంగమంత్రి జై శంకర్ తాజాగా స్పందించారు. సరిహద్దు సమస్యలతో భారత్-చైనా మధ్య క్షీణించిన సంబంధాలను సరిచేయాలంటే కొన్ని చర్యలు అవసరమని ఆయన సూచించారు. ఇందుకు పరస్పర గౌరవం, సున్నితత్వం, పరస్పర ప్రయోజనాల కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందని జై శంకర్ గుర్తుచేశారు. గత సంవత్సరం చైనా చర్యలు బలగాల పరిమాణం తగ్గించే సంప్రదాయాన్ని విస్మరించడాన్ని సూచించడమే కాకుండా, సరిహద్దులో శాంతి మరియు ప్రశాంతతను ఉల్లంఘించే వాతావరణానికి దారి తీసిందని ఆయన అన్నారు.
గతేడాది కంటే ముందు 1975లో సరిహద్దుల్లో భారత సైనికుల ప్రాణనష్టం జరిగినా స్దూలంగా చూస్తే సరిహద్దులు ఇప్పటికీ ప్రశాంతంగానే ఉన్నాయని జై శంకర్ తెలిపారు. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణపై ఇప్పటికైనా చైనా నుంచి సానుకూల స్పందన వస్తే పరిస్ధితులు కచ్చితంగా మారతాయని తాను భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భారత్-చైనా మధ్య క్లీణించిన సంబంధాలు ఇరుదేశాల్లో ప్రజల్లో, రాజకీయ నాయకుల్లో అపనమ్మకం పెంచాయని జైశంకర్ పేర్కొన్నారు.