జైట్లీ మంచి భోజనప్రియుడు...ఆ మేధావి లేనిలోటు పూడ్చలేనిది: అద్వానీ
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ శనివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖులు జైట్లీకి నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఉన్నారు. జైట్లీ కుటుంబ సభ్యులను ఫోనులో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. జైట్లీ మృతితో తను వ్యక్తిగతంగా చాలా కోల్పోయినట్లు మోడీ ట్వీట్ చేశారు. తనకు ఎంతో ఆప్తుడని గుర్తుచేసుకున్న మోడీ... ఆయన లేని లోటును పూడ్చలేనిదని చెప్పారు. ఇక బీజేపీ కురవృద్ధుడు ఎల్కే అద్వానీ కూడా జైట్లీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
అరుణ్ జైట్లీ మంచి భోజన ప్రియుడని చెప్పారు అద్వానీ. ఫలానా రెస్టారెంట్లో భోజనం బాగుంటుందని ఎప్పుడూ తనకు రికమెండ్ చేసేవారని అద్వానీ గుర్తు చేసుకున్నారు. అరుణ్ జైట్లీ మృధు స్వభావి అని కొనియాడిని అద్వానీ... అత్యద్భుతమైన పార్లమెంటేరియన్ అని చెప్పారు. మంచి న్యాయవాదిగా గుర్తింపు పొందిన జైట్లీ మంచి పాలనాధక్ష్యత ఉన్న వ్యక్తి అని ప్రశంసించారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరితో చాలా స్నేహంతో జైట్లీ మెలిగే వారని అద్వానీ చెప్పారు. ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా పార్టీలో జైట్లీ కొనాసాగారని గుర్తుచేసుకున్న అద్వానీ... పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆయన ఐడియాల కోసం ఆధారపడేదని చెప్పారు. ప్రత్యర్థులకు ధీటుగా సమాధానం ఇచ్చి వారిని ఇరుకున పెట్టగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి జైట్లీ అని అద్వానీ తెలిపారు.
తాను పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాజకీయ అరంగేట్రం చేశారని గుర్తు చేసిన అద్వానీ.... ఆ తర్వాత జైట్లీ అంచలంచెలుగా ఎదిగి కేంద్రమంత్రి పదవిని చేపట్టారని చెప్పారు. అంతేకాదు ప్రతి దీపావళి రోజున జైట్లీ తన కుటుంబ సభ్యులతో తన ఇంటికి వచ్చేవారని అద్వానీ గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు.
Delhi: Veteran BJP leader Lal Krishna Advani pays tribute to former Union Finance Minister Arun Jaitley, who passed away at All India Institute of Medical Sciences, earlier today. pic.twitter.com/oOBoU9veQO
— ANI (@ANI) August 24, 2019
గత కొన్ని వారాలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో జైట్లీ తిరిగి క్షేమంగా వస్తారని అంతా భావించామని అయితే విధి దూరం చేస్తుందని తాము భావించలేదని అద్వానీ అన్నారు. జైట్లీ మరణం ఇటు పార్టీకి అటు దేశానికి తీరని లోటని అద్వానీ అన్నారు. అంతేకాదు వ్యక్తిగతంగా తాను అత్యంత సన్నిహితుడిని కోల్పోయానంటూ కన్నీటిపర్యంతమయ్యారు అద్వానీ. జైట్లీ ఆత్మకు శాంతి చేకూరాలని అద్వానీ కోరారు.