ఎమర్జెన్సీ డే: ఇందిరా గాంధీని హిట్లర్తో పోల్చిన అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దివంగత ప్రధాని ఇందిరా గాంధీని హిట్లర్తో పోల్చారు. ఎమర్జెన్సీ డేను బీజేపీ బ్లాక్ డేగా నిర్వహించింది. దేశంలో ఎమర్జెన్సీ విధించి సోమవారానికి 43 ఏళ్లు అయిన నేపథ్యంలో ఎమర్జెన్సీ రోజులను కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ గుర్తు చేస్తూ ఇందిరా గాంధీపై మండిపడ్డారు.
'హిట్లర్, ఇందిరా గాంధీ రాజ్యాంగాన్ని ఏరోజూ ఖాతరు చేయలేదు. ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చారు. హిట్లర్ పార్లమెంటులోని విపక్ష నేతలందరినీ అరెస్ట్ చేసి పార్లమెంటులోని తన మైనారిటీ ప్రభుత్వానికి మూడింట రెండు వంతుల ఆధిక్యాన్ని సాధించార'ని జైట్లీ పేర్కొన్నారు.
హిట్లర్కు మాదిరిగానా ఇందిరా గాంధీ సైతం ఆనువంశిక ప్రజాస్వామ్యంగా దేశాన్ని మార్చారన్నారు. ఎమర్జెన్సీ రోజుల్లో దేశమంతా భయం గుప్పిట్లో చిక్కుకుందని, రాజకీయ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయన్నారు. మీడియాపై ఆంక్షలు విధించారన్నారు. అసమ్మతి నేతలను ముఖ్యంగా విపక్ష పార్టీల కార్యకర్తలు, ఆరెస్సెస్ కార్యకర్తలను టార్గెట్ చేశారన్నారు.
అయినప్పటికీ వారు నిరంతర సత్యాగ్రహాలతో స్వచ్ఛందంగా అరెస్టయ్యారన్నారు. అప్పట్లో ఇందిరా గాంధీ.. విపక్షాలు దేశాన్ని స్థిరపరచే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపిస్తూ ప్రజల ప్రాథమిక హక్కులను రద్దు చేశారని, 353వ అధికరణ కింద దేశంలో ఎమర్జెన్సీ విధించారన్నారు.