స్పష్టత, పారదర్శకత... మోడీ ఏడాది పాలన: సాధించిన విజయాలివే
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో మోడీ ప్రభుత్వం ఏం చేసిందనే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం చెప్పారు.
ఈ పన్నెండు నెలల కాలంలో 18 దేశాలు ప్రధాని మోడీ తిరిగారని చెప్పారు. ప్రపంచ నేతలను కలిశారని, తద్వారా ప్రపంచంలో భారత దేశానికి ఓ గౌరవం, ప్రాధాన్యతను తీసుకు వచ్చారని అభిప్రాయపడ్డారు. అందువల్ల ప్రపంచ చిత్రపటంపై భారత్ ఖ్యాతి మరింత ఇనుమడించిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో పారదర్శకత కనిపిస్తుందన్నారు. అంతేకాకుండా, ఓ విజన్ ఉందని చెప్పారు. మోడీ ప్రభుత్వం ఏ దిశలో వెళ్తుందో పూర్తి స్పష్టత ఉందని చెప్పారు. అంతిమంగా తమ విజన్ అభివృద్ధి అన్నారు.
విద్యుత్, బొగ్గు, గనులు తదితర రంగాల్లో తీసుకున్న నిర్ణయాలు పారదర్శకంగా సాగాయన్నారు. సంస్కరణళ అమలుపై నిబద్ధత చాటామన్నారు. గత ప్రభుత్వాల సమయంలో ఏర్పడ్డ అపఖ్యాతి మెల్లిగా పోతోందన్నారు.
భారత దేశంలో పన్నుల విధానం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న విధానానికి అనుగుణంగా మార్చాలన్న అడుగులు పడ్డాయన్నారు. ఇష్టానుసారం తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని, పన్ను రాయితీలు తొలగాల్సి ఉందన్నారు.
అవినీతిరహిత పరిపాలన దిశగా కీలక అడుగు వేశామన్నారు. వ్యవస్థలో సమాఖ్యతత్వాన్ని బలోపేతం చేశామని చెప్పారు. నీతి అయోగ్ ఏర్పాటు కీలకమైన ముందడుగు అని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ద్రవ్యలోటు, కరెంటు ఖాతాల లోటు, వృద్ధి రేటు, రెవెన్యూ గణాంకాలు స్థిరంగా ఉన్నాయని, మరింత క్వాలిటీ కోసం సహకారతత్వన్ని ప్రోత్సహిస్తామన్నారు.
నల్లధనాన్ని నిలువరించే దిశగా రాబోయే సంవత్సరంలో మరిన్ని కఠిన చర్యలు ఉంటాయన్నారు. గతంలో ఆగిన 16 ప్రాజెక్టుల విషయంలో వచ్చే సంవత్సరం పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. వ్యవసాయ రంగం, గ్రామీణ మౌలిక వసతుల విభాగాల్లో పెట్టుబడులు పెంచాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నారన్నారు.
డిఫెన్స్ పర్సనల్స్కు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ తాము తీసుకున్న మరో నిర్ణయమన్నారు. ప్రపంచంలోనే వేగవంతంగా మన ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతోందన్నారు. అయితే, ఇది మాత్రమే సరిపోతుందని తాము భావించడం లేదన్నారు.
ప్రపంచ ఆర్థిక మాంద్యంతో బ్యాంకింగ్ రంగం ఎంతో ఒత్తిడితో ఉన్నప్పటికీ, కార్య నిర్వహణాధికారులు, బోర్డు సభ్యుల నియామకం హుందాగా సాగుతోందన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన బీమా పథకాలు వారాల వ్యవధిలో 7.5 కోట్ల మందికి చేరాయన్నారు. ఇవన్నీ సామాన్యులకు బీమా ప్రయోజనాలను చేకూర్చేవే అన్నారు. ఎన్డీయే ప్రారంభించిన ముద్రా బ్యాంకు ద్వారా రూ.5.7 కోట్ల చిన్న ఔత్సాహికులకు ఆర్థిక సాయం అందనుందని చెప్పారు.