మేం అడ్డుపడితే: టి బిల్లుపై సుష్మ, టిడిపి పొత్తుపై జైట్లీ
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీకి తెలంగాణ ఇవ్వాలని లేదని, తాము అడ్డుపడి ఉంటే తెలంగాణ బిల్లు ఆగేదని బిజెపి సీనియర్ నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలు శనివారం అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ నింద తమ పైన వేసి తప్పించుకోవాలని చూసిందని ఆరోపించారు. తమ లక్ష్యం తెలంగాణ ఇవ్వడమే అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను వ్యతిరేకంగా ఓటు వేయవద్దని నిర్ణయించుకున్నామని చెప్పారు.
కాంగ్రెసు పార్టీ తెలంగాణ అంశంతో ఆడుకోవాలని చూశారని, తాము వారి ఆటలు సాగనివ్వలేదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎపి రాష్ట్ర విభజనను తెలుగుదేశం పార్టీ, విదర్భ విభజనను శివసేన వ్యతిరేకించిందన్నారు. అందుకే తాము ఇవ్వలేకపోయామన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేసేందుకు కృషి చేశామని, మోడీ ప్రభుత్వం వచ్చాక సీమాంధ్రకు న్యాయం చేస్తామన్నారు.
అహంకారంతో చట్టాలు చేయవద్దని, చేస్తే వాటికి తాము సహకరించేది లేదన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో బిజెపి విజయావకాశాలకు ఏమాత్రం ఢోకా లేదని, పదకొండు పార్టీల కలయికతో తాజాగా ఏర్పడిన కూటమి విఫలమవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో ఇప్పటికే పలుసార్లు తృతీయ ఫ్రంట్ ప్రయోగం విఫలమైందన్నారు.
లోక్సభ ఎన్నికల్లో బిజెపికి 272 స్థానాలు ఖాయమని, అవసరమైతే ఇతర భాగస్వామ్య పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ తృతీయ ఫ్రంట్ విఫలమైతే ఆ పరిణామాలను భరించే స్థితిలో దేశం లేదని, అందువల్ల ఆ దిశగా ఆలోచించవద్దని ప్రజలకు సూచించారు. టిడిపితో పొత్తుపై ప్రశ్నించినపుడు, పొత్తుల విషయంలో బిజెపి స్వతంత్రంగా వ్యవహరిస్తుందని జైట్లీ సమాధానమిచ్చారు. బిజెపి పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందన్నారు.
గత పదేళ్ల యూపీఏ పాలనను చూశాక, వచ్చే ఎన్నికల్లో తమకు ప్రజలు పట్టం కడతారన్న నమ్మకం పెరుగుతోందని సుష్మా అభిప్రాయపడ్డారు. పార్టీ ప్రధాని అభ్యర్థి మోడీ నిర్వహిస్తున్న బహిరంగ సభలకు లభిస్తున్న జనాదరణ చూస్తుంటే ఈసారి బిజెపికి అఖండ మెజారిటీ తప్పదన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సాధిస్తున్న ఘన విజయాల గురించి లోక్సభ ఎన్నికల్లో ప్రజలకు వివరిస్తామన్నారు.
పదేళ్ల యూపిఏ పాలనలో అవినీతి కుంభకోణాలు, అసమర్థ నాయకత్వం, ప్రజలకు కష్టాలు నిత్యకృత్యం అయ్యాయని విమర్శించారు. సిబిఐ, కాగ్, పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీ, సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేసిన సూచనలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలన సాగిందన్నారు. ప్రతిపక్షాలు గొంతు చించుకున్నా 2జి స్ప్రెక్టమ్ వంటి కుంభకోణాలు చోటు చేసుకున్నాయని సుష్మా ఆరోపించారు. అద్వానీని తమ పార్టీ పక్కన పెట్టిందన్న ములాయం సింగ్ వాదనలో నిజం లేదన్నారు.