సిగ్గులేని వ్యక్తి: జైట్లీపై జెఠ్మలానీ, ‘కీర్తి హీరో’ అని సిన్హా
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ మీద సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. డీడీసీఏ అవినీతి ఆరోపణల నేపథ్యంలో అరుణ్జైట్లీ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్ తరపున రాంజెఠ్మలానీ వాదించనున్నారు.
క్రిమినల్ లాయర్గా పేరొందిన రాంజెఠ్మలానీ ఈ విషయంపై మాట్లాడుతూ.. అరుణ్జైట్లీపై వందలాది ఆరోపణలున్నాయన్నారు. అతనో సిగ్గులేని మనిషని ఘాటుగా విమర్శించారు. జైట్లీని వెనకేసుకొస్తున్నందుకు ఆయన ప్రధాని మోడీని కూడా తప్పుబట్టారు.
బిజెపి అగ్రనేత అద్వానీతో జైట్లీని పోల్చడం సబబు కాదన్నారు. గతంలో హవాలా కేసులో తాను అద్వానీ లాయర్గా వ్యవహరించిన సంగతి గుర్తుచేశారు. ఇప్పుడు తానే అరుణ్జైట్లీని విచారించబోతున్నానని రాంజెఠ్మలానీ చెప్పారు.
కీర్తి ఆజాద్ హీరో, శిక్షించకండి: శత్రుఘ్న సిన్హా
బిజెపి ఎంపి కీర్తి ఆజాద్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న హీరో అని, అతడ్ని శిక్షించొద్దని సినీ నటుడు, బిజెపి ఎంపి శతృఘ్న సిన్హా అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్జైట్లీపై విమర్శలు చేయొద్దని సొంత పార్టీ వర్గాలు, సీనియర్ బిజెపి నేతలు హెచ్చరిస్తున్నా.. వాటిని పట్టించుకోకుండా కీర్తి ఆజాద్ అవినీతి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిజెపి కీర్తిని సస్పెండ్ చేసింది.
కాగా, కీర్తి ఆజాద్కు శతృఘ్న సిన్హా మద్దతుగా నిలిచారు. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడారని ఆజాద్ను ప్రశంసించారు. ఈ వ్యాఖ్యలకు ఆజాద్పై చర్యలు తీసుకోవద్దని సిన్హా బిజెపికి సూచించారు. అలా చేస్తే తిరిగి బిజెపికే నష్టం కలుగుతుందని అన్నారు.