అంత్యక్రియలు అయిపోయాక.. అసలు నిజం తెలిసి షాక్
జలంధర్ : అంత్యక్రియలు కూడా పూర్తయ్యాక.. చనిపోయిన వ్యక్తి బ్రతికే ఉన్నాడన్న సంగతి తెలిస్తే ఎలా ఉంటుంది? తాజాగా పంజాబ్లోని జలంధర్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దీంతో తొలుత షాక్ తిన్న ఆ కుటుంబం.. ఆ తర్వాత అసలు నిజం తెలుసుకుని తేరుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జలంధర్కు నివాసి అయిన చందన్ కుమార్ వ్యాపార పనుల నిమిత్తం గత నెల 29న హిమాచల్ప్రదేశ్కు వెళ్లాడు. ఆ మరుసటి రోజే కుటుంబ సభ్యులకు ఉన నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. పంజాబ్-హిమాచల్ బోర్డర్లో ఓ మృతదేహం పడి ఉందని, పక్కనే కారు కూడా ఉందని, మృతదేహం వద్ద దొరికిన వివరాల ఆధారంగా ఫోన్ చేస్టున్నట్లుగా సదరు వ్యక్తులు తెలపడంతో చందన్ కుటుంబం తీవ్ర షాక్ కు గురైంది.
తీరా అక్కడికెళ్లి చూస్తే.. మృతదేహం గుర్తుపట్టలేకుండా ఉండడం.. కారు మాత్రం చందన్ దే కావడంతో చనిపోయింది అతడేనని భావించారు. అనంతరం ఆ మృతదేహానికి అక్టోబర్ 4న జలంధర్ లో అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత 10రోజులకు చందన్ కుటుంబ సభ్యులకు మరో ఫోన్ కాల్ వచ్చింది. చందన్ బతికే ఉన్నాడని, అయితే కొంతమంది కిడ్నాపర్లు అతన్ని కిడ్నాప్ చేసి ఎక్కడున్నాడో గుర్తించకుండా ఉండాలంటే.. చనిపోయినట్లుగా చిత్రీకరించాలని ఈ హైడ్రామాకు తెరలేపారని తెలిసింది. దీంతో చందన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.