జలియన్వాలా బాగ్ ఓ నెత్తుటి మరక..! స్వాతంత్ర్య కాంక్షను రెట్టింపు చేసిన ఘటన..!!
హైదరాబాద్ : అత్యంత విషాద ఘటనల్లో ఒకటైన జలియన్ వాలాబాగ్ సంఘటనకు నేటితో వందేళ్లు పూర్తవుతున్నాయి. భారతీయుల పై బ్రిటిష్ ప్రభుత్వం అంత్యంత పాశవికంగా జరిపిన కాల్పుల తర్వాత మరింత ఐకమత్యం పెల్లుబికింది. ఈ దారుణ ఉదంతం భారతీయుల స్వాతంత్ర్య కాంక్షను అణచలేకపోయింది. ఉద్యమం మరింత ఎగసింది. ఫలితంగా 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం లభించింది. వేలాది మంది అమరవీరుల ప్రాణత్యాగాలతో భారత్ ఏర్పడింది.
స్వాతంత్ర్య కాంక్షను అణచలేకపోయింది..! దారుణంగా జరిపిన కాల్పులు..!!
ఏప్రిల్ 13, 1919, అమృత్సర్లోని జలియన్వాలా బాగ్ పార్క్, బైశాఖి పర్వదినం కావడంతో పాటు జాతీయ నాయకులైన డా.సత్యపాల్, సైఫుద్దీన్కిచ్లుల అక్రమ అరెస్టుకు నిరసనగా బాగ్లో సమావేశం...వేలమంది ప్రజలు సమావేశమయ్యారు... అందరూ నిరాయుధులు, సామాన్యులు.. ఇంతలో జనరల్ డయ్యర్ నేతృత్వంలోని సాయుధ సైనిక దళం అక్కడకు చేరుకుంది. ఎటువంటి హెచ్చరికలు లేకుండానే కాల్పులు ప్రారంభించింది. మధ్యలో కొందరు సైనికులు గాలిలోకి కాల్పులు జరిపారు. ‘గాల్లోకి కాల్పులు జరిపి తూటాలు వృథా చేయవద్దు. గురి చూసి గుండెలపై కాల్చండి పడినవారు తిరిగి లేవకూడదు' అని డయ్యర్ ఆదేశం. దీంతో రెచ్చిపోయిన సైనికులు ఏకధాటిగా పదినిమిషాల పాటు 1650 రౌండ్ల కాల్పులు జరిపారు. చివరకు తూటాలు అయిపోవడంతో కాల్పులు ముగిశాయి.
1000మంది బలిదానం..! బ్రిటిష్ ప్రభుత్వ దురహంకారం..!!
దేశ చరిత్రలో ఇదో నరమేధం. బ్రిటిషువారి అహంకార, దుర్మార్గ వైఖరికి జలియన్వాలాబాగ్ ఉదంతం అద్దంపడుతుంది. బక్కప్రాణులపై ఇంతటి బలప్రయోగమేంటని దేశంలో నిరసనలు వ్యక్తమయ్యాయి. బ్రిటిషువారు కూడా ఈ ఘోరకలిపై చలించిపోయారు. బ్రిటిషువారి లెక్కల ప్రకారం 379 చనిపోయారని 1100మంది గాయపడ్డారని తెలుస్తోంది. అయితే ప్రత్యక్షసాక్షులు, కాంగ్రెస్ వర్గాల అంచనా ప్రకారం వెయ్యిమందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు అప్పటి నివేదికలు తెలుపుతున్నాయి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ఘటనపై నిర్ఘాంతపోయారు. తనకు బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించిన నైట్హుడ్ బిరుదును తిరస్కరించారు.
బావిలోనే 120 మృతదేహాలు..! ప్రాణాలు కాపాదుకుందమని దూకేసారు..!!
కాల్పుల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ప్రవేశమార్గాల వద్దకు వెళ్లారు. మొత్తం ఐదు ప్రవేశమార్గాలు ఉండగా ఒకటి మాత్రమే పెద్దది. అయితే దీన్ని బ్రిటిషుసైనికులు మూసివేయడంతో ప్రజలకు తప్పించుకునేందుకు వీలులేకుండా పోయింది. తప్పించుకునే క్రమంలో పార్క్లోని బావిలో ప్రజలు దూకేశారు. ఇక్కడ నుంచే 120 మృతదేహాలను వెలికితీశారు.
రక్తపిపాసి డయ్యర్..! చివరికి కుక్క చావు..!!
జలియన్వాలా బాగ్ ఘటనలో జనరల్ డయ్యర్తో పాటు లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న మైఖేల్ ఒ డయ్యర్ ప్రధాన నిందితులని చెప్పవచ్చు. అమాయకుల ప్రాణాలను అకారణంగా బలి తీసుకున్న జనరల్ డయ్యర్ ఈ ఘటనపై ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. జలియన్వాలాబాగ్ ఘటనపై బ్రిటిషు ప్రభుత్వం నియమించిన హంటర్ కమిషన్ ముందు హాజరైన అతన్ని సభ్యులు పలురకాలుగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రధాన ద్వారం వద్దకు భారీ సైనిక వాహనాన్ని తీసుకువచ్చారు కదా.. అయితే ప్రవేశమార్గం చిన్నది కావడంతో తీసుకెళ్లలేకపోయారు. ఒక వేళ వెళ్లివుంటే మెషిన్ గన్తో కాల్పులు జరిపేవారు కదా అని ప్రశ్నించారు. అవును కచ్చితంగా మెషిన్గన్తో కాల్చేవాళ్లం దాంతో ఇంకా ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయేవాళ్లు అని డయ్యర్ చెప్పిన సమాధానం అతనిలో పరమ దుర్మార్గ వైఖరికి అద్దంపట్టింది. అనంతరం రాజీనామా చేసిన డయ్యర్ బ్రిటన్కు చేరుకున్నాడు. అనేక రోగాలతో దీర్ఘకాలం బాధపడిన అతను 1927లో చనిపోయాడు.