లెట్స్ డూ కుమ్ముడు: దూలతీర్చిన ఎద్దులు.. పరుగెత్తించి మరీ పొడిచిపారేశాయి.. రక్తసిక్తంగా జల్లికట్టు
కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోదన్న తరహాలో.. ఎద్దుల కుమ్ముడుకు పోటీదారులు బిత్తరపోయారు.. బరిలో పరుగెత్తించిమరీ చుక్కలు చూపించాయి.. ముట్టుకోడానికి దగ్గరకొచ్చిన ప్రతివాణ్ని పొడిచిపారేశాయి.. బ్యారికేడ్లను కూలదోసిమరీ ప్రేక్షకులపైనా దాడికి దిగాయి.. మొత్తంగా తమిళనాడులో సంప్రదాయ జల్లికట్టు క్రీడ రక్తసిక్తంగా సాగుతోంది.
కూడబలుక్కున్నట్లు..
పొంగల్ సందర్భంగా తమిళనాడులో ఏటా నిర్వహించే జల్లికట్టును చూసేందుకు ఎప్పటిలాగే జనం తండోపతండాలుగా వచ్చారు. పోటీలకు ప్రధాన కేంద్రాలుగా ఉన్న మధురై, తిరుచిరాపల్లి జిల్లాల్లోనైతే ఇసుకేస్తే రాలనంతమంది ప్రేక్షకులు పోగయ్యారు. ఈలలు, కేరింతల నడము ఉత్సాహంగా బరిలోకి దిగిన యువకులు.. ఎద్దుల పొగరుముందు చిన్నబోవాల్సిన పరిస్థితి. వందలమంది ఒక్కటై ప్రయత్నించినా.. ఒక్క ఎద్దును కూడా నిలువరించలేకపోయారు. ‘లెట్స్ డూ కుమ్ముడు..'అని కూడబలుక్కున్నట్లు ఎద్దులన్నీ చాలా అగ్రెసివ్ గా ప్రవర్తించాయి.
మంత్రిగారి చేతుల మీదుగా..
రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ గురువారం తిరుచిరాపల్లిలో పోటీలను ప్రారంభించారు. అరియలూరు జిల్లాలోనూ స్థానిక ఎమ్మెల్యేలే దగ్గరుండి మరీ పోటీసులు నిర్వహిస్తున్నారు. మధురై జిల్లాలో బుధవారం నుంచే జల్లికట్టు జోరందుకుంది. మధురై హైకోర్టు బెంచ్ ఆదేశాల నేపథ్యంలో జల్లికట్టు పోటీలు జరిగే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. మొత్తం 2వేల ఎద్దులకు మాత్రమే బరిలోకి దిగేందుకు అనుమతిచ్చారు. పలమేడులో 650, అవనియాపురంలో 730, అలంగనళ్లూరులో 700 ఎద్దులు బరిలోకి దిగుతున్నాయి.
పక్కాగా రూల్స్..
జల్లికట్టులో పాల్గొనే పోటీదారులకు సంబంధించి ఈసారి పక్కాగా రూల్స్ ప్రవేశపెట్టారు. బరిలో దిగడానికి ముందు పోటీదారులతో ప్రమాణాలు చేయించారు. ఉద్దేశపూర్వకంగాకానీ, పొరపాటునగానీ ఎద్దుల్ని హింసించబోమని క్రీడాకారులు ప్రమాణాలు చేశారు. పోటీదారులు 75 మందిని కలిపి ఒక్కో జట్టుగా విభజించారు. ఒక జట్టు కేవలం 60 ఎద్దులతో మాత్రమే తలపడ్డారు. ఎద్దులకు కూడా వైద్యపరీక్షలు నిర్వహించారు. గాయపడ్డవారికి చికిత్స అందించడానికి 20 ఆంబులెన్స్ లను సిద్ధంగా ఉంచారు.