'జల్లికట్టు'లో ఇంత జరిగిందా?: పన్నీర్ నోట నిర్ఘాంతపోయే అంశాలు..
కొంతమంది ఆందోళనకారులు మరో అడుగు ముందుకేసి.. తమిళ దేశం కావాలని డిమాండ్ చేసినట్టుగా పన్నీర్ సెల్వం తెలిపారు.
చెన్నై: అసాంఘీక శక్తులు జల్లికట్టును హింసాత్మకంగా మార్చాయని చెప్పుకొచ్చిన తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం.. మరికొన్ని నిర్ఘాంతపోయే విషయాలను వెల్లడించారు. జల్లికట్టు ఉద్యమం సందర్బంగా కొంతమంది నిరసనకారులు వ్యవహరించిన వివాదస్పద తీరును సెల్వం అసెంబ్లీలో ప్రస్తావించారు.
జల్లికట్టు ఆందోళనకారులపై పోలీసుల ప్రయోగాన్ని వ్యతిరేకిస్తూ డీఎంకె నేత స్టాలిన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో పన్నీర్ సెల్వం.. పలు షాకింగ్ వివరాలు వెల్లడించారు. తమిళదేశం డిమాండ్తో పాటు, ఒసామా బిన్ లాడెన్ వంటి ఉగ్రవాదుల ఫోటోలు ఆందోళనల్లో దర్శనమిచ్చినట్టుగా చెప్పారు.
తమిళదేశం డిమాండ్:
తమిళ సాంప్రదాయ క్రీడ జల్లికట్టు కోసం చేసిన ఉద్యమంలో కొంతమంది ఆందోళనకారులు మరో అడుగు ముందుకేసి.. తమిళ దేశం కావాలని డిమాండ్ చేసినట్టుగా పన్నీర్ సెల్వం తెలిపారు.
'జల్లికట్టు'లో ఒసామా బిన్ లాడెన్ ఫోటోలు:
జల్లికట్టు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది నిరసనకారులు ఒసమా బిన్ లాడెన్ ఫోటోను ఆందోళనల్లో ప్రదర్శించినట్టుగా సీఎం పన్నీర్ సెల్వం తెలియజేశారు. ఒసామా బిన్ లాడెన్ ఫోటోను చూపిస్తూ వారు నిరసనలో పాల్గొన్నట్టుగా పేర్కొన్నారు.
గణతంత్ర దినోత్సవాన్ని బహిష్కరించమన్నారు:తీవ్రరూపం
దాల్చిన జల్లికట్టు ఉద్యమం ముగింపు దశలో విపరీత ధోరణిని అవలంభించినట్టుగానే కనిపిస్తోంది. సీఎం పన్నీర్ వ్యాఖ్యలతో ఈ విషయం స్పష్టమవుతోంది. జల్లికట్టుపై ఆర్డినెన్స్ తెచ్చాక కూడా.. కొంతమంది ఆందోళనకారులు గణతంత్ర దినోత్సవాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేసినట్టుగా పన్నీర్ సెల్వం అసెంబ్లీలో చెప్పారు.
పోలీసుల జోక్యం అందుకే:
జల్లికట్టుపై నిషేధం ఎత్తేసిన తర్వాత కూడా కొంతమంది ఆందోళనకారులు రిపబ్లిక్ డే వరకు ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నట్టుగా పన్నీర్ సెల్వం తెలిపారు. అందువల్లే ఉద్యమంలో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు.
ప్రమాణ పూర్తిగా నేనీ విషయం చెప్తున్నాన్న సెల్వం.. కొన్ని గ్రూపులు కావాలనే నల్లజెండాలు పనిగట్టుకుని ప్రదర్శించాయన్నారు. వారిని అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు తెలిపారు. అయితే, ఆరోజు జరిగిన హింసపై జ్యుడిషియల్ దర్యాప్తు చేయించాలని స్టాలిన్ డిమాండ్ చేయగా, ప్రభుత్వంతో నిరాకరించడంతో వారు వాకౌట్ చేశారు.