ఆంధ్రావాళ్లు మొనగాళ్లు.. జల్లికట్టు నిరసనలో ఏపీపై తమిళుల ప్రశంస
'కోడి పందేలు నిర్వహించవద్దంటూ ఓవైపు కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా.. గుట్టు చప్పుడు కాకుండా కోడిపందేలు నిర్వహించుకున్న ఆంధ్రా వాసుల్లారా.. మొనగాళ్లంటే మీరే.. '
చెన్నై: మొత్తానికి పట్టిన పట్టు వీడకుండా తమిళ ప్రజలు తాము అనుకున్నది సాధించారు. కుల, మత రాజకీయాలకు అతీతంగా తమిళ ప్రజానీకమంతా ఒక్క తాటిపైకి వచ్చి జల్లికట్టు కోసం నినదించడంతో.. కేంద్రం సైతం దిగిరాక తప్పకలేదు.
తమిళనాడు ప్రభుత్వం పంపించిన ఆర్డినెన్స్ కు కొద్దిపాటి మార్పులు చేసి కేంద్రం దాన్ని న్యాయశాఖ ఆమోదం కోసం పంపించింది. దీంతొ తమ ఆకాంక్ష నెరవేరినందుకు తమిళ ప్రజలంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
మెరీనాబీచ్ వేదికగా జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొన్న సంగతి తెలిసిందే. కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొస్తుందన్న విషయం తెలియగానే.. హర్షం వ్యక్తం చేసిన యువత.. అదే సమయంలో ఆంధ్రా ప్రాంత వాసుల స్పూర్తిని కొనియాడారు.
'కోడి పందేలు నిర్వహించవద్దంటూ ఓవైపు కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా.. గుట్టు చప్పుడు కాకుండా కోడిపందేలు నిర్వహించుకున్న ఆంధ్రా వాసుల్లారా.. మొనగాళ్లంటే మీరే.. అనుకున్నట్టే కోడి పందేలు పూర్తి చేశారు. మేం మాత్రం ఇంకా జల్లికట్టు జరుపుకోలేకపోతున్నాం' అంటూ నినాదాలు చేశారు.