జల్లికట్టు ఆందోళనలు హింసాత్మకం.. మంత్రిని తరిమేశారు..
పోలీసులు కూడా లాఠీలు జులిపిస్తుండటంతో.. ఆందోళనకారులకు, పోలీసులకు నడుమ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.
కోయంబత్తూరు: జల్లికట్టుపై పూర్తిగా ఆంక్షలు ఎత్తివేయాలని తమిళ యువత చేస్తోన్న ఆందోళనలు హింసాత్మక రూపం దాలుస్తున్నాయి. పోలీసులు కూడా లాఠీలు జులిపిస్తుండటంతో.. ఆందోళనకారులకు, పోలీసులకు నడుమ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.
నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో మెరీనా బీచ్ ప్రాంగణమంతా అల్లర్లమయంగా మారింది. ఆందోళనకారులను బలవంతంగా తరలించడానికి పోలీసులు ప్రయత్నిస్తుండటంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో ఆందోళన తమిళనాడువ్యాప్తంగా నెలకొంది.
తాజాగా కోయంబత్తూరులోని కొడిశా మైదానంలోను ఆందోళనకారుల నిరసన హింసాత్మకంగా మారింది. పోలీసులు వారిని బలవంతంగా తరలించేందుకు ప్రయత్నించగా.. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతొ ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు మంత్రి వెలుమణి, పోలీస్ కమిషనర్ తో కలిసి అక్కడికి వచ్చారు.
ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు మంత్రి ప్రయత్నించగా.. వారు మంత్రిపై తిరగబడ్డారు. ఆగ్రహంతో ఊగిపోతూ 'గో బ్యాక్' నినాదాలు చేశారు. మంత్రి, కమిషనర్ల వాహనాలపై కర్రలు, రాళ్లతో దాడులకు దిగారు. దీంతో లాఠీచార్జీ చేసి ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ, తోపులాట చోటు చేసుకుంది.