జల్లికట్టులో రక్తపాతం.. ఎద్దు కుమ్మడంతో మహిళ మృతి.. పోటీదారులకూ తీవ్రగాయాలు.. 108 వాహనాలు బిజీ..
సంక్రాంతి(పొంగల్) పండుగ సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు పోటీలు జోరుగా సాగుతున్నాయి. అదే స్థాయిలో నెత్తుటి ధారలూ కనిపించాయి. ఎద్దులకు వైద్యపరీక్షలు నిర్వహించడం దగ్గర్నుంచి, పటిష్టమైన బారికెడ్ల నిర్మాణం దాకా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తొలి రెండు రోజుల్లోనే హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. ఈనెల 31వరకు తమిళనాడులో జల్లికట్టు పోటీలు కొనసాగనున్నాయి.
ఆంక్షలు, సూచనల నడుమ..
జల్లికట్టు పోటీలను ఒక పద్ధతి ప్రకారం నిర్వహించాలని మధురై హైకోర్టు బెంచ్ ఆదేశించడం తెలిసిందే. కోర్టు తరఫున పోటీల పర్యవేక్షకుడిగా నియమితులైన మాజీ జిల్లా జడ్జి సీ.మాణికమ్.. తిరుచిరాపల్లి, మధురై జిల్లాల కలెక్టర్లతో కలిసి జల్లికట్టు పోటీలు జరిగే ప్రాంతాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈసారి పరిమిత సంఖ్యలో రెండు వేల ఎద్దులకు మాత్రమే అనుమతినిచ్చారు. పోటీదారులు 75 మందిని కలిపి ఒక్కో జట్టుగా విభజించారు.
పాపం మహాలక్ష్మి..
తిరుచిరాపల్లి జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. కుటుంబీకులతో కలిసి జల్లికట్టు చూడటానికి వచ్చిన మహాలక్ష్మి అనే మహిళ అనూహ్యంగా చనిపోయింది. ఓ ఎద్దు రంకెలు వేస్తూ బారికేడ్లను ఢీకొట్టి ప్రేక్షకులవైపు దూసుకొచ్చి మహాలక్ష్మిని కుమ్మింది. ఆలోపే తొక్కిసలాట కూడా జరిగింది. సొమ్మసిల్లిపడిపోయిన మహాలక్ష్మిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.
బిబీ బిజీగా 108 ఆంబులెన్స్ లు..
తమిళనాడులో జల్లికట్టు క్రీడకు కేంద్రంగా ఉన్న మధురై, తిరుచిరాపల్లి జిల్లాల్లో పోటీలు జరుగుతోన్న ప్రాంతంలో అధికారులు పక్కాగా ఏర్పాటు చేశారు. ఒక్కో క్రీడాప్రాంగణం వద్ద 5 నుంచి 20 ఆంబెలెన్స్ లను అందుబాటులో ఉంచారు. రెండు జిల్లాల్లో కలిపి ఎద్దుల దాడిలో ఇప్పటిదాకా వందమందికిపైగా పోటీదారులు తీవ్రంగా గాయపడ్డారు. 108 ఆంబులెన్స్ ల ఏర్పాటుతో చాలా మందికి ప్రాణాపాయం తప్పినట్లయింది. క్షతగాత్రులకు సాయం చేస్తూ 108 సిబ్బంది బిజీబిజీగా కనిపించారు.