జంబలకిడిపంబ ... వరుడి మెడలో తాళి కట్టిన వధువు
సాధారణంగా పెళ్లంటే వధువు మెడలో వరుడు తాళి కడతాడు. మాంగల్యం తంతునామేనా , మమ జీవన హేతునా అంటూ వేదమంత్రాల సాక్షిగా పెళ్లికూతురు మెడలో పెళ్ళికొడుకు తాళి కట్టడం సహజంగా జరిగే పెళ్లి తంతు. కానీ అందుకు భిన్నంగా వరుడు మెడలో వధువు తాళి కట్టడం ప్రస్తుతం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. జంబలకిడిపంబ సినిమాను గుర్తు చేస్తుంది
జంబలకిడిపంబ తరహాలో పెండ్లికుమార్తె, పెండ్లి కుమారుడి మెడలో తాళి కట్టిన ఆసక్తికర సన్నివేశం కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా ముద్దే బిహాళ్ తాలూకా నాలత వాడ గ్రామంలో చోటు చేసుకుంది.
వధువు మెడలో వరుడు తాళిబొట్టుతో మూడు ముళ్ళు వెయ్యాల్సిన చోట నాలత వాడ గ్రామంలో సోమవారం నాడు జరిగిన రెండు వివాహాలలోనూ వరుడికి వధువు లే తాళి కట్టారు. అంతే కాదు సాంప్రదాయపు సంకెళ్ళను బద్దలు కొడుతూ విలక్షణ వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లి కి పెట్టే ముహూర్తం కూడా వ్యతిరేకించిన వధూవరులు శుభ లగ్నం లేకుండానే పెళ్లి చేసుకున్నారు .
ఈ గ్రామంలో జరిగిన రెండు వివాహాలకు సంబంధించిన వివరాలను చూస్తే ప్రభు రాజ్ కు అంకిత తో వివాహం జరిగింది. అలాగే అమిత్ తో ప్రియా కు వివాహం జరిగింది. విలక్షణంగా వివాహం చేసుకోవాలనుకున్న వారు శుభ లగ్నం , ముహూర్తం వంటి వాటిని చూసుకోకుండా పెళ్లి చేసుకున్నారు. అలాగే వరుడు ప్రభు రాజ్ కు అంకిత, మరో వరుడు అమిత్ కు ప్రియ తాళి కట్టారు. మూడుముళ్లు వేశారు. దీంతో వీళ్ళు చేసిన పని చర్చనీయాంశం అయ్యింది. ఇక ఆ గ్రామంలో ఈ వివాహాలను చూసినవారు ఇదెక్కడి చోద్యమని ముక్కున వేలేసుకున్నారు.
అదేంటి ఇలా వివాహం జరిపిస్తున్నారు అని ప్రశ్నించిన వారికి వారు చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. అదేంటంటే 12వ శతాబ్దంలో జరిగిన వివాహాలలో ఇదే పద్ధతి అమలులో వుండేదట. అందుకే దాన్ని మళ్లీ తిరిగి పునరుద్ధరించడానికి ఈ విధంగా వివాహం చేసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ.