హైదరాబాద్ ఎన్కౌంటర్ కేసును విచారించాల్సి ఉంది.. మీ గోలేంటీ?: జామియా విద్యార్థులకు సుప్రీం చీవాట్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులకు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. చేసిందంతా చేసి.. ఏకంగా సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం వెనుక ఆంతర్యమేంటని నిలదీసింది. ఢిల్లీ హైకోర్టు అంటూ ఒకటుందనే విషయాన్ని విస్మరించారా? అని మొట్టికాయలు వేసింది. తొలుత- ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయాలని హితబోధ చేసింది.
క్యాంపస్ లో పోలీసుల ప్రవేశానికి వ్యతిరేకంగా..
జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం క్యాంపస్ లోకి పోలీసులు ప్రవేశించడాన్ని సవాలు చేస్తూ.. విద్యార్థి సంఘాల ప్రతినిధులు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. విద్యార్థి సంఘాల ప్రతినిధుల తరఫున ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ పిటీషన్ ను వేశారు. ఈ పిటీషన్ మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం సమక్షానికి వచ్చింది. పిటీషన్ పై విచారణ చేపట్టిన తొలి నిమిషాల్లోనే న్యాయమూర్తులు.. అసహనాన్ని వ్యక్తం చేశారు.
ఢిల్లీ హైకోర్టుకెళ్లండి..
సుప్రీంకోర్టు అనేది ట్రయల్ కోర్టు వంటి కాదని తాము గుర్తు చేయాల్సి రావడం బాధాకరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ ను వేయాలని, ఆ తరువాతే తమ వద్దకు రావాలని ఇందిరా జైసింగ్ కు సూచించారు. అక్రమంగా క్యాంపస్ లోకి ప్రవేశించిన ఢిల్లీ పోలీసులపై చర్యలు చేపట్టడానికి ఇప్పటికిప్పుడు తాము ఎలాంటి ఆదేశాలను కూడా ఇవ్వలేమిన పేర్కొంది. ఈ వ్యవహారంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని, ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది ధర్మాసనం.
హైదరాబాద్ ఎన్ కౌంటర్ కేసును..
ప్రస్తుతం తాము హైదరాబాద్ ఎన్ కౌంటర్ ను విచారించాల్సి ఉందని, ఈ పరిస్థితుల్లో ఇలాంటి పిటీషన్లను తమ సమక్షానికి ఎలా తీసుకుని రాగలుగుతారని ధర్మాసనం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విద్యార్థులు తమ ఇష్టానుసారంగా బస్సులను దగ్ధం చేశారని, దీనికి నష్ట పరిహారాన్ని ఎవరు చెల్లిస్తారని న్యాయమూర్తులు ప్రశ్నించారు. చేసిందంతా చేసి, ఇప్పుడు ఢిల్లీ పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ తమను ఆశ్రయించడంలో అర్థం లేదని అన్నారు.