విద్యార్థులు..యువ బాంబుల్లా కనిపిస్తున్నారా? మరో జలియన్ వాలా బాగ్: ఉద్ధవ్..!
ముంబై: శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.. మరోసారి కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా ఆందోళనలను నిర్వహిస్తోన్న జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో ఢిల్లీ పోలీసులు ప్రవేశించడాన్ని ఆయన జలియన్ వాలా బాగ్ సంఘటనతో పోల్చారు. కేంద్ర ప్రభుత్వం కంటికి విశ్వవిద్యాలయాల విద్యార్థులు యువ బాంబుల్లా కనిపిస్తున్నట్లుందని వ్యాఖ్యానించారు.
ఉద్ధవ్ థాకరే కేబినెట్: పదవుల పంపకాలు: ఎన్సీపీకి లక్కీ ఛాన్స్: సేన వద్దే హోం.. కాంగ్రెస్ కు..!
మంగళవారం ఆయన ముంబైలో విలేకరులతో మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వివిధ జాతీయ స్థాయి విద్యాసంస్థలు, కళాశాలల విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేస్తోన్న ఉదంతంపై స్పందించారు. ఐఐటీ- బోంబే సహా మహారాష్ట్రలోని యూనివర్శిటీలు, విద్యాసంస్థలు కూడా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తున్నాయి.
జామియా వర్శిటీ క్యాంపస్ లోకి ఢిల్లీ పోలీసులు ప్రవేశించడం, విద్యార్థులపై లాఠీఛార్జీ చేయడాన్ని నిరసిస్తున్నాయి. ఈ నేపథ్యంలో- ఉద్ధవ్ థాకరే స్పందించారు. జామియా విశ్వవిద్యాలయంలో పోలీసులు ప్రవేశించడం..విద్యార్థులపై లాఠీ ఛార్జీకి దిగడం వంటి చర్యలు జలియన్ వాలా బాగ్ కాల్పుల ఉదంతాన్ని గుర్తుకు తెచ్చిందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అకారణంగా విద్యార్థులను రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటోందని విమర్శించారు.
విశ్వవిద్యాలయాలు, జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో అభ్యసించే విద్యార్థుల శక్తిని కేంద్రం తక్కువగా అంచనా వేసిందని, దాని ఫలితంగానే దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఉద్యమాలు చెలరేగుతున్నాయని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని మహారాష్ట్రలో అమలు చేయడంపై ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయాన్ని కూడా తీసుకోలేమని స్పష్టం చేశారు. దీనిపై మహా వికాస్ అఘాడీ కూటమి నాయకులతో చర్చించాల్సి ఉందని చెప్పారు.