సీసీటీవి ఫుటేజీని బయటపెట్టిన జామియా విద్యార్థులు.. ఆరోజు జరిగింది ఇదీ...
ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ లైబ్రరీలో విద్యార్థులపై పోలీసుల దాడికి సంబంధించి జామియా కోఆర్డినేషన్ కమిటీ సీసీటీవి ఫుటేజీని బయటపెట్టింది. పోలీసులు ఎంఏ/ఎంఫిల్ లైబ్రరీలోకి చొరబడి విద్యార్థులను లాఠీలతో కొడుతున్న దృశ్యాలు అందులో స్పష్టంగా రికార్డయ్యాయి. చదువుకుంటున్న విద్యార్థులపై దాడి చేసి అక్కడినుంచి పంపించివేసినట్టుగా అందులో కనిపిస్తోంది.
పోలీసుల పాశవిక దాడిని సీసీటీవి ఫుటేజీ బయటపెట్టిందని జామియా కోఆర్డినేషన్ కమిటీ పేర్కొంది. పోలీసులు,ప్రభుత్వ డైరెక్షన్లో కొంతమంది తీవ్రవాదులు విద్యార్థులపై దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. లైబ్రరీలో పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది.
Exclusive CCTV Footage of Police Brutality in Old Reading Hall, First floor-M.A/M.Phill Section on
— Jamia Coordination Committee (@Jamia_JCC) February 15, 2020
15/12/2019
Shame on you @DelhiPolice @ndtvindia @ttindia @tehseenp @RanaAyyub @Mdzeeshanayyub @ReallySwara @ANI @CNN @ReutersIndia @AltNews @BBCHindi @the_hindu @TheQuint @BDUTT pic.twitter.com/q2Z9Xq7lxv
గతేడాది డిసెంబర్ 15న ఈ ఘటన చోటు చేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం('CAA)కి వ్యతిరేకంగా జామియా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చడంతో.. ఆందోళనకారులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వర్సిటీలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో పోలీసులు కాలేజీ లైబ్రరీ, బాత్రూమ్స్లోకి చొరబడి విద్యార్థులపై దాడి చేశారన్న ఆరోపణలున్నాయి.
ఈ ఘటనపై ప్రతిపక్షాలు,ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఇందులో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో పోలీసుల జులుంపై న్యాయవాది ఇందిరా జైసింగ్,కొలిన్ గాన్ సాల్వేస్ సుప్రీంలో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. అయితే శాంతియుత పరిస్థితులు నెలకొన్న తర్వాతే పిటిషన్లపై విచారణ జరుపుతామని సుప్రీం మెలిక పెట్టింది.
మరోవైపు జామియా యూనివర్సిటీలో ప్రవేశించి పోలీసులు విధ్వంసం సృష్టించారన్న ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. వర్సిటీలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారన్న ఆరోపణలను కూడా ఖండించారు. చాలా తక్కువ ఫోర్స్ను ఉపయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చామన్నారు. అంతేకాదు,విద్యార్థులపై ఎక్కడా కాల్పులు జరపలేదన్నారు.నిరసనలు హింసాత్మక రూపం దాల్చడంతో 30మంది పోలీసులు గాయాలపాలైనట్టు చెప్పారు. గాయాలపాలైన పోలీసుల్లో ఏసీపీ,డీసీపీ హోదా కలిగినవాళ్లు కూడా ఉన్నారన్నారు.