Video vs video: జామియా వర్సిటీలో జేసీసీ, పోలీసులు పోటాపోటీ వీడియోలు, ఘటనపై ఎంక్వైరీ
జామియా మిలియా వర్సిటీలో డిసెంబర్ 15వ తేదీన జరిగిన దాడులపై జామియా కో ఆర్డినేషన్ కమిటీ (జేసీసీ), పోలీసులు పోటాపోటీగా వీడియోలు విడుదల చేశారు. ఆదివారం 45 సెకన్ల నిడివిగల వీడియోను జేసీసీ రిలీజ్ చేసిన వెంటనే.. పోలీసులు మరో వీడియోను మీడియాకు చూపించారు. అందులో కొందరు ఆందోళనకారుల చేతిలో రాళ్లు ఉన్నాయి. లైబ్రరీలోకి కొందరు ప్రవేశించి, రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు.
వీడియో రిలీజ్..
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటిన సమయంలో.. డిసెంబర్ 15వ తేదీన జామియా మిలియా వర్సిటీలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. క్యాంపస్లో ఉన్న తమపై పోలీసులు దాడి చేశారని విద్యార్థులు వీడియో విడుదల చేయగా.. బయటి వ్యక్తులు కూడా వచ్చారని పోలీసులు వీడియోలో స్పష్టంగా కనిపస్తోంది. లైబ్రరీలో కొందరు విద్యార్థులు చదువుకొంటుండగా పారామిలిటరీ, పోలీసులు ఎనిమిది మంది వరకు మొహానికి కర్చీప్ కట్టుకొని వచ్చారు. అక్కడే ఉన్న విద్యార్థులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు.
పోలీసుల వీడియో..
సీఏఏకు వ్యతిరేకంగా క్యాంపస్లో జరుగుతోన్న ఆందోళనలో బయటి వ్యక్తులు పాల్గొంటున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. లైబ్రరీలోకి కొందరు ఆందోళనకారులు ప్రవేశించారని.. వారి చేతిలో రాళ్లు కూడా ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. కొందరు లైబ్రరీలో చదువుకొంటుండగా బయటి వ్యక్తులు లైబ్రరీలోకి ప్రవేశించిన ఫుటేజీని మీడియాకు చూపించారు. 15 నుంచి 20 మంది వరకు లోపలికి తీసుకొన్నారని.. వారు వచ్చాకు తలుపుకు అడ్డంగా టేబుల్ కూడా జరిపారని పేర్కొన్నారు. అంతేకాదు క్యాంపస్ బయట దుండగులు వాహనాలకు నిప్పు అంటించారని పోలీసులు ఆరోపిస్తున్నారు.
విచారణ
జామియా మిలియా వర్సిటీ లైబ్రరీలో చదువుకొంటున్న విద్యార్థులపై పోలీసులు దాడి చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసు స్పెషల్ కమిషనర్ ప్రవీర్ రంజన్ స్పందించారు. ఘటనపై తాము విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు.