అమర్ నాథ్ యాత్ర నిలిపివేత!
జమ్మూ: పవిత్ర అమర్ నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. తాత్కాలికంగా ఈ యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జమ్మూ మాార్గం నుంచి అమర్ నాథ్ వెళ్లే భక్తులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల బుధవారం ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా జమ్మూ-శ్రీనగర్ మధ్య రహదారి మూసుకునిపోయింది. దీనితో ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిషేధించారు.
Jammu and Kashmir: Amarnath Yatra is suspended from Jammu route today on account of inclement weather. https://t.co/xedPs6zJfP
— ANI (@ANI) July 31, 2019
కొద్దిరోజులుగా జమ్మూ కాశ్మీర్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం నుంచీ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దీనివల్ల జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్లే మార్గంపై కొండచరియలు విరిగి పడ్డాయి. రామ్ బన్ జిల్లా రామ్ సౌ సమీపంలో పంథియాల్, మోమ్ పస్సీ గ్రామాల మధ్య పెద్ద ఎత్తున కొండచరియలు విరిగి పడ్డాయి. ఆ మార్గం అంతా బండరాళ్లతో నిండిపోయింది. ఫలితంగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిషేధించారు స్థానిక అధికారులు.
అమర్ నాథ్ గుహలో వెలసిన మంచు లింగాన్ని దర్శించడానికి వెళ్లే భక్తులు జమ్మూ మార్గం గుండా వెళ్లాలంటే ఈ మార్గం ఒక్కటే ఆధారం. అది కాస్తా మూసుకునిపోయింది. ఈ మార్గం గుండా అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలని అధికారులు సూచించారు. ప్రత్యామ్నాయ మార్గం అంటే- పెహల్ గావ్ మీదుగా అమర్ నాథ్ యాత్రను కొనసాగించే వీలు ఉంది. కొండచరియలను తొలగించిన వెంటనే యాత్రకు అనుమతి ఇస్తామని వెల్లడించారు.