ఒకే దేశం..ఒకే జెండా ఇప్పట్లో సాధ్యం కాదా? కాశ్మీర్ సచివాలయంపై ప్రత్యేక పతాకం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదాను కట్టబెట్టడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దయింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం, జమ్మూ కాశ్మీర్ ను విభజించడం, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడానికి అవసరమైన బిల్లు చట్ట రూపం దాల్చినప్పటికీ.. అది ఇంకా అమలు కావట్లేదు. దీనిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రత్యేకంగా గెజిట్ ను జారీ చేసినప్పటికీ.. జమ్మూ కాశ్మీర్ లో రెండు జెండాలు ఎగురుతున్నాయి. రాజధాని శ్రీనగర్ లోని పౌర సచివాలయం భవన సముదాయంపై బుధవారం ఉదయం- త్రివర్ణ పతాకంతో పాటు జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక జెండా కూడా రెపరెపలాడుతూ కనిపించింది.
కియా తొలి కారు ఆవిష్కరణకు వేళాయె..వైఎస్ జగన్ అనంత పర్యటన షెడ్యూల్ ఇదే!
ఆర్టికల్ 370 ప్రకారం.. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి ఉంది. ప్రత్యేక జెండా ఉంది. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం దాదాపు అరుదుగా చెప్పుకోవచ్చు. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ అయిదేళ్లకోసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే.. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి మాత్రం ఆరేళ్లకోసారి ఎన్నికల ప్రక్రియను చేపడతారు. భారత రాజ్యాంగం అక్కడ వర్తించదు. చట్టాలేవీ పనిచేయవు. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఎవరూ అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోకూడదు. భూములను కొనుగోలు చేయకూడదు. దేశానికి తలమానికంగా భావించే జమ్మూ కాశ్మీర్ ను ప్రత్యేక రాష్ట్రంగా ఇన్నేళ్లుగా కొనసాగింది. దీనికి ప్రధాన కారణం.. ఆర్టికల్ 370.
దీన్ని రద్దు చేస్తూ అవసరమైన తీర్మానంపై రాజ్యసభ, లోక్ సభ ఆమోద ముద్ర వేసినప్పటికీ.. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక జెండా మాత్రం ఇంకా ఎగురుతూనే కనిపిస్తోంది. మువ్వన్నెల జాతీయ పతాకంతో పాటు ప్రత్యేక జెండాను ఆవిష్కరించారు అక్కడి అధికారులు. దీన్ని ఇంకా తొలగించాల్సి ఉందని అంటున్నారు. అధికారికంగా ఆదేశాలు అందిన వెంటనే జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక జెండాను అవనతం చేస్తామని చెబుతున్నారు. ప్రత్యేక జెండాను అవనతం చేశారంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవన్నీ నిరాధారమైనవని తాజా ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి.