ఒకే దేశం, ఒకే జెండా... కశ్మీర్ అధికారిక వేడుకల్లో రెండు జెండాలకు పుల్స్టాప్ పడనుందా..?
భారత దేశం మొత్తం మీద ఇక నుండి ఒకే జెండా రెపరెపలాడనుంది. ఇప్పటివరకు కశ్మీర్కు ప్రత్యేక హక్కులు ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో భారత దేశ జాతీయ జెండాతోపాటు కశ్మీర్ రాష్ట్రం యొక్క జెండాను కూడ సమాంతరంగా ఎగరవేసేవారు. కాని ప్రస్థుతం ప్రత్యేక హక్కులు రద్దు చేయడంతోపాటు ,యూనియన్ టెర్రిటరీగా ఏర్పాటు చేశారు. ఇక నుండి భారత జాతీయ జెండానే కశ్మీర్లో ఎగరేయాల్సి ఉంటుంది. ఈ నేఫథ్యంలోనే ప్రధాని మోడీ సైతం ఈసారి ప్రత్యేకంగా జమ్ము కశ్మీర్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గోనున్నట్టు కూడ వార్తలు వెలువడుతున్నాయి.
అధికారిక వేడుకల్లో జాతీయ జెండాతోపాటు కశ్మీర్ జెండా
ఆర్టికల్ 370 ప్రకారమే కశ్మీర్కు ప్రత్యేక జెండా హక్కు కల్గి ఉంది. దీంతో ప్రభుత్వం యొక్క అధికారిక కార్యక్రమాల్లో జాతీయ జెండాతోపాటు రాష్ట్ర జెండాను ఎగరవేస్తారు. కాగా జమ్ము కశ్మీర్ రాష్ట్ర జెండా పూర్తిగా ఎరుపు రంగులో ఉండడంతోపాటు మూడు గీతలను కల్గి ఉంటుంది. గత డెబ్బై సంవత్సరాలుగా కశ్మీరీలకు ఉన్న ప్రత్యేక హక్కులు రద్దు కావడంతో కోన్ని రాజకీయా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనే కశ్మీర్ రాష్ట్రంలో ఇప్పటి వరకు జాతీయ జెండా అయిన మూడు రంగుల జెండాతో పాటు కశ్మీర్కు ప్రత్యేకంగా ఉన్న ఎరుపు రంగు జెండాను కూడ ఎగరవేసేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయానికి ఫుల్స్టాప్ పడనుంది. ఆర్టికల్స్ రద్దుతో కశ్మీర్లో సైతం త్రివర్ణ పతాకం మాత్రమే ఎగరనుంది.
కశ్మీర్కు ప్రత్యేక జెండా ఎందుకు
1952లో కేంద్రం, రాష్ట్ర అధికారాలను నిర్వచించే ఒప్పందంపై నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, జమ్మూ కశ్మీర్ ప్రధాని షేక్ మొహమ్మద్ అబ్దుల్లాలు సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలోనే అంతకుముందు నుండే ఉన్న రాష్ట్ర జెండాపై కూడ ఒప్పందం చేసుకున్నారు. త్రివర్ణ పతాకం జాతీయ జెండాగా ఉంటే, కశ్మీర్ జెండా రాష్ట్ర జెండాగా ఉంటుందని ఒప్పందం కుదుర్చుకున్నారు.దీంతో రెండు జెండాలను ఎగరేసే అధికారం కూడా రాష్ట్రానికి దక్కింది. దీంతో భారత్లోని ఇతర ప్రదేశాల్లో జాతీయ జెండాకు ఎలాంటి స్థాయి ఉంటుందో జమ్మూకశ్మీర్లోనూ అలానే ఉంటుంది. అయితే, జమ్మూకశ్మీర్ స్వతంత్ర పోరాటానికి సంబంధించిన చారిత్రిక కారణాల దృష్ట్యా రాష్ట్ర జెండాకు కూడా గుర్తింపు ఉంటుంది ఒప్పందంలో పేర్కొన్నారు.
ఎన్నోసార్లు జాతీయ జెండాను అవమానాల పాలు చేసిన ప్రత్యేక వాదులు
కశ్మీర్కు ప్రత్యేక అధికారాలు ఉండడంతో భారత జాతీయ జెండా అయిన త్రివర్ణ పతాకాన్ని కశ్మీర్ ప్రత్యేక వాదులు అవహేళన చేసేవారు. పోరుగు దేశమైన పాకిస్థాన్ జెండాను తమ జాతీయ జెండాగా అభివర్ణించడంతో పాటు చాల సార్లు అవమానాలకు గురి చేసిన సంఘటనలు ఉండేవి. ముఖ్యంగా కశ్మీరీలకు ఉండే ప్రత్యేక హక్కులతో వాళ్లను ఎలాంటీ కేసులు పెట్టలేని పరిస్థితి. ఆర్టికల్ రద్దు కావడంతో జాతీయ జెండా పూర్తిగా రెపరెపలాడనుంది.