బట్టలు కుట్టే టైలర్ కు గ్రెనేడ్లతో ఏం పని? టైలరింగ్ షాప్ లో 15 బాంబులు స్వాధీనం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు ఓ టైలరింగ్ షాప్ నుంచి పెద్ద ఎత్తున గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నాయి. కుప్వారా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుప్వారా జిల్లాలోని కెరన్ సెక్టార్ లో జవాన్లు పర్వేజ్ ఖవాజా అనే టైలర్ నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కెరన్ సెక్టార్ లో పాకిస్తాన్ సరిహద్దులను దాటుకుని భారత్ లోకి చొరబడటానికి ప్రయత్నించిన అయిదుమంది ఉగ్రవాదులను కాల్చి చంపిన కొన్ని గంటల వ్యవధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పర్వేజ్ ఖవాజాకు చెందిన టైలరింగ్ షాప్ లో భారీ పేలుడు చోటు చేసుకుంది.
అడుగు
బయట
పెట్టలేని
స్థితి:
నో
మొబైల్..నో
ఇంటర్
నెట్:
144
సెక్షన్
విధింపు
ఈ పేలుడు ఫలితంగా అతని పొరుగింట్లో నివాసం ఉంటోన్న అబ్దుల్ హమీద్ బజద్ అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. తొలుత తమ ఇంట్లో సిలిండర్ పేలిందని పర్వేజ్ ఖవాజా నమ్మించడానికి ప్రయత్నించాడు. పేలుడు సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న జవాన్లు.. అతని టైలరింగ్ షాపులో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 15 గ్రెనేడ్లు వారి కంట పడ్డాయి. దుస్తుల మాటున వాటిని దాచి ఉంచారు. పర్వేజ్ ఖవాజాను జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. అతణ్ని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇదే సెక్టార్ పరిధిలో సరిహద్దులను దాటుతున్న అయిదు మంది అనుమానిత ఉగ్రవాదులను సరిహద్దు భద్రతా బలగాలు కాల్చి చంపిన విషయం తెలిసిందే. సరిహద్దుల వెంట కంచె బలహీనంగా ఉన్న ప్రాంతం నుంచి భారత భూభాగంపైకి అడుగు పెట్టడానికి ప్రయత్నించిన ఆ అయిదు మంది ఉగ్రవాదులనూ బీఎస్ఎఫ్ బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటన చోటు చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలో టైలరింగ్ షాప్ లో పేలుడు సంభవించడం, భారీ ఎత్తున గ్రెనేడ్లు లభించడం స్థానికులను ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తారు.