కశ్మీర్ ఎన్నికల్లో నాన్ లోకల్స్ కు ఓటు-మరో వివాదంలో కేంద్రం-స్ధానిక పార్టీల ఫైర్
వచ్చే ఏడాది జమ్ము-కశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఓటర్ల జాబితాలో ప్రత్యేక సవరణలు చేయిస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ జాబితాలో స్ధానికేతరులకు భారీ ఎత్తున ఓటర్లుగా చేర్చడం వివాదాస్పదమవుతోంది.
జమ్మూ కాశ్మీర్లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో 25 లక్షల మంది కొత్త ఓటర్లు ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. స్థానికేతరులు ఈ ప్రాంతంలో తొలిసారిగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. దీనిపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఇదో ప్రమాదకరమైన ప్రయత్నంగా అభివర్ణించారు. జమ్మూ కాశ్మీర్లో నాలుగేళ్లకు పైగా ఎన్నికైన ప్రభుత్వం లేకుండా పోయింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు.
2019లో ఆర్టికల్ 370 ప్రకారం కశ్మీర్ కు ప్రత్యేక హోదాను కేంద్రం రద్దు చేసిన తర్వాత కాశ్మీరేతరులు ఓటు వేయడానికి , భూమిని సొంతం చేసుకోవడానికి రాజ్యాంగాన్ని మార్చిన తర్వాత తొలిసారి స్థానికేతరులు జమ్మూ కాశ్మీర్లో ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ హిర్దేష్ కుమార్ దీనిపై స్పందిస్తూ.. ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలో 20 లక్షలకు పైగా కొత్త ఓటర్లు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నామన్నారు. దీంతో ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 76 లక్షల మంది ఓటర్లకు అదనంగా మూడో వంతు కంటే ఎక్కువ ఓటర్ల సంఖ్య పెరగవచ్చని అంచనా.