పాక్ తీరు మారదు: మరోసారి కాల్పులు, ముగ్గురు పౌరులు మృతి
కుప్వారా: ప్రపంచమంతా కరోనావైరస్తో పోరాడుతుంటే.. పాకిస్థాన్ మాత్రం తమకేమీ పట్టనట్లు భారతదేశంపై తన కుట్రలను కొనసాగిస్తూనే ఉంది. ఆదివారం జమ్మూకాశ్మీర్లోని కుప్వారాలో పాకిస్థాన్ సైనికులు కాల్పులతో తెగబడ్డారు. దీంతో ముగ్గురు స్థానికులు ప్రాణాలు కోల్పోయారు.
ఆదివారం సాయంత్రం 5 గంటలకు పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. పూంఛ్, కథువా జిల్లాల తర్వాత కుప్వారాలోని రంగ్వార్ ప్రాంతంలో పాకిస్థాన్ సైనికులు కాల్పులకు తెగబడ్డారని చెప్పారు.
కిర్ని, కస్బా జిల్లాలో పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ మహిళ గాయపడిందని ఆర్మీ అధికారులు తెలిపారు. బాలాకోట్ సెక్టార్లో దాచివుంచిన ఓ లైవ్ మోర్టారు బాంబును గుర్తించిన భద్రతా దళాలు, దాన్ని నిర్వీర్యం చేశాయి.
కాగా, గత శనివారం బాలకోట్, మెందర్ సెక్టార్లలో పాకిస్థాన్ పెద్ద ఎత్తున కాల్పులకు తెగడటంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయని ఆర్మీ అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా వరుసగా పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడుతోందన్నారు.
గత ఆదివారం ఉగ్రవాదులకు, జవాన్లకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు భారత సైనికులు మరణించారు. భారత జవాన్ల కాల్పుల్లో పలువురు ఉగ్రవాదులు మరణించారు.