సంజువాన్ ఆర్మీ శిబిరంపై ఉగ్రమూక దాడి: 4గురు మిలిటెంట్లు, 5 సైనికుల మృతి
కాశ్మీర్: జమ్ములోని సంజువాన్ ఆర్మీ శిబిరంపై శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు జరిపిన దాడి యూరీ 2016 దాడి తర్వాత ఘోరమైన దాడిగా అధికారులు అభివర్ణించారు. నాడు యూరీ ఘటనలో 19మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఈ దాడిలో అయిదుగురు సైనికులు, ఓ పౌరుడు మృతి చెందారు.
భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. భారీ మారణాయుధాలతో ఉగ్రవాదులు సంజువాన్ క్యాంపుపై దాడికి తెగబడిన 24 గంటల తర్వాత కూడా గాలింపు చర్యలు కొనసాగాయి. తొమ్మిదిమంది గాయపడ్డారని, స్థావరం లోపల నుంచే కనీసం ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు కొనసాగిస్తున్నారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
జమ్మూ ప్రాంతంలో పదిహేను నెలలుగా నెలకొన్న ప్రశాంతతకు తూట్లు పొడుస్తూ ముష్కరులు ఈ దాడికి తెగబడ్డారు. చివరిసారిగా ఈ ప్రాంతంలో 2016 నవంబర్ 29న జమ్మూ శివార్లలోని నగ్రోటా శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేశారు.
తాజాగా జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫ్యాంట్రీ దళానికి చెందిన 36వ బ్రిగేడ్ శిబిరాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు. సైనిక దుస్తులు ధరించిన ముష్కరులు శనివారం తెల్లవారుజామున ఈ శిబిరం వద్దకు వచ్చారు. వీరివద్ద ఏకే 56 తుపాకులు, భారీగా మందుగుండు సామగ్రి, గ్రెనేడ్లు ఉన్నాయి. తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో సైనిక శిబిరం వెలుపల అనుమానాస్పద కదలికలను అక్కడి బంకర్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికుడు గుర్తించాడు.
ఆ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నంతలోనే ఆ బంకర్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. రెండు వర్గాల మధ్య కొద్దిసేపు కాల్పులు కొనసాగాయి. అనంతరం ఉగ్రవాదులు వెనుకభాగం నుంచి ఈ శిబిరంలో సైనికుల కుటుంబాలు నివాసం ఉండే ప్రాంగణంలోకి ప్రవేశించారు. మెరుపు దళాలు వేగంగా స్పందించి, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
తొలుత అక్కడ నివాసం ఉంటున్న దాదాపు 150 కుటుంబాలను సైన్యం ఖాళీ చేయించింది. నివాస ప్రాంగణంలో మహిళలు, చిన్నారులు ఉండటం వల్ల ఉగ్రవాదులపై చాలా జాగ్రత్తగా సైనిక చర్యను చేపట్టారు. ఉగ్రవాదుల నక్కిన నిర్దిష్ట ప్రదేశాన్ని గుర్తించడానికి హెలికాప్టర్లు, డ్రోన్లను రంగంలోకి దించారు. స్థావరం వెనుక భాగం నుంచి తూటారక్షక వాహనాల్లో సైనిక సిబ్బంది కుటుంబాలను తరలించారు. ఆ తర్వాత ఉగ్రవాదుల పని పట్టే కార్యక్రమం ప్రారంభించింది.
రాత్రి సమయంలో ఆపరేషన్ను సాగించడానికి జనరేటర్లు, శక్తిమంతమైన లైట్లను తెప్పించారు. హతమైన ఉగ్రవాదుల వద్ద లభ్యమైన వస్తువులను బట్టి వారంతా జైష్ ఎ మహ్మద్కు చెందినవారని గుర్తించారు. ఈ దాడి నేపథ్యంలో జమ్ములో అప్రమత్తత ప్రకటించారు.